చిత్తూరు రూరల్ (కాణిపాకం): జన్మించినప్పటి నుంచే ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ చిన్నారి జీవితంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డాక్టర్లు వెలుగులు నింపారు. నెలలు నిండకముందే పుట్టిన ఆ పాపకు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తిరుపతి జిల్లా పాకల మండలం దామలచెరువుకు చెందిన శిరీషా–విజయకుమార్ దంపతులకు పుట్టిన పాప ప్రారంభం నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. పాలు సరిగా తాగకపోవడం, తల పరిమాణం అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో కుటుంబం ఆందోళనకు గురైంది. పరిస్థితి విషమించడంతో వెంటనే చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, పాప మెదడులో రక్తస్రావంతో పాటు నీరు చేరినట్టు గుర్తించారు. ఇది హైడ్రోసెఫలస్ అనే ప్రమాదకర స్థితి. ప్రాణాపాయం ఉన్న ఈ కేసును వైద్యులు సవాలుగా స్వీకరించారు. మొదట పాపకు వస్తున్న ఫిట్స్ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అనంతరం అత్యంత జాగ్రత్తలతో క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీకి సిద్ధమయ్యారు. తక్కువ బరువు, పలుచని చర్మం కారణంగా ప్రతి క్షణం ప్రమాదకరంగా మారిన ఈ ఆపరేషన్ను న్యూరో శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె.సాయినాథ్రెడ్డి నేతత్వంలో విజయవంతంగా పూర్తిచేశారు. మెదడులో చేరిన నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేక స్టంట్ను అమర్చి, రక్తప్రసరణను సక్రమంగా పునరుద్ధరించారు. ఆపరేషన్ తర్వాత పాప ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అపోలో ఆధ్వర్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి మానవత్వానికి చిరునామాగా నిలిచింది.


