
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● వారం క్రితం నగల దుకాణంలో చోరీ ● ఎట్టకేలకు పట్టుబడిన నిందితుడు ● ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరు అర్బన్: అంతర్రాష్ట్ర దొంగకు సినిమాలంటే మోజు. ఆ మోజుతో సినిమా తీసి అప్పుల్లో కూరుకుపోయాడు. బాలనేరస్తుడిగా మొదలై ప్రస్తుతం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల చిత్తూరులోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసి పోలీ సుల చేతికి చిక్కాడు. నగరంలోని పోలీసుల అతిథి గృహంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సమక్షంలో పోలీసులు అతడిని అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరం జెండామానువీధిలోని శరవణ బంగారు దుకాణంలో ఈనెల 4వ తేదీన చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తలుపులు పగలగొట్టి 126 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. షాపు యజమాని శరవణ ఆచారి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దొంగ ను పట్టుకోవడానికి కసరత్తులు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగ జాడలను పసిగట్టారు. కర్ణాటక రాష్ట్రం ఎంఆర్ఎస్ పాళ్యకు చెందిన ఆనంద్గా నిర్ధారణకు వచ్చారు. చాకచక్యంగా అతడిని పట్టుకుని, రూ.11.80 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. సినిమా మీద పిచ్చితోనే దొంగతనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కీచకుడు అనే కన్నడ సినిమాను తెరకెక్కించాడని..అయితే అది రిలీజ్కు నోచుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సినిమా పిచ్చి వల్ల చోరీలకు అలవాటు పడ్డాడని పోలీసులు వివరించారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో బాలనేరస్తుడిగా మద్రవేసుకుని, మొత్తం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య, ఇతర పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ సాయినాథ్ అభినందించారు. బైక్ దొంగతనాలను అరికడుతామని, త్వరలో అరెస్టులు ఉంటాయని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు