
చివరి దశకు అయ్యోర్ల బదిలీలు
● బదిలీల్లో పలువురు టీచర్లకు అన్యాయం ● సమస్యల పరిష్కారానికి కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్లు ● నేటితో ప్రక్రియ ముగించేలా విద్యాశాఖ కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు చివరి అంకానికి చేరింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ అయ్యోర్లకు చుక్కలు చూపించింది. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు నిబంధనలను బదిలీల ప్రక్రియలో అమలు చేశారు. స్పౌజ్ల విషయంలో అనేక ఇబ్బందులు సృష్టించారు.
నేటితో ముగియనున్న ప్రక్రియ
జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఈ నెల 14వ తేదీన సీరియల్ నం.2000 నుంచి 3000 వరకు కౌన్సెలింగ్ చేపట్టారు. అనంతరం మైనర్ మీడియా ఎస్జీటీల కౌన్సెలింగ్కు తక్కువ మంది ఉండడంతో ఆదివారంతో ప్రక్రియ ముగించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలు, వింత నిబంధనల వల్ల మెజారిటీ శాతం ఉపాధ్యాయులు బదిలీల్లో నష్టపోయారు. కూటమి సర్కారు పాలనలో నష్టపోయామంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు మండిపడుతున్నారు.
కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్
బదిలీల ప్రక్రియలో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బాధిత టీచర్ల నుంచి గ్రీవెన్స్ తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో దాదాపు 180 ఎస్జీటీ, 75 దాకా స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రీవెన్స్కొచ్చాయి. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి.