
నేడు ఊరూరా వెన్నుపోటు దినం
చిత్తూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలను అబద్దపు హామీలతో మోసగించి, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంను నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసనలు చేపడుతున్నారు.
నిరసనలు తెలిపే ప్రాంతాలు ఇవే..
● చిత్తూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. వేలూరు రోడ్డుపై పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తారు.
● పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు పట్టణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహిస్తారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందచేస్తారు.
● నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. అక్కడి నుంచి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం ఇచ్చి, ఓంశక్తి ఆలయ కూడలి మీదుగా రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నారు.
● గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో అయిదు మండలాల్లోని నాయకులు ఉదయం 9 గంటలకు కొత్తపల్లెమిట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి గంగాధర నెల్లూరులో అధికారులకు వినతిపత్రం ఇస్తారు.
● పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యంలో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేస్తారు.
● పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పట్టణ నడిబొడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం ఇస్తారు.
● కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరుతారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని వినతిపత్రం ఇస్తారు.
‘ఖాకీ’లపై ప్రభుత్వం ఒత్తిడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినంకు ఆ పార్టీ నాయకులు, తటస్తులు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు అనధికారిక ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమల్లో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రధాన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, ర్యాలీలు చేయొద్దని పోలీసులు హుకు జారీ చేస్తున్నారు. అయినా సరే తమ పార్టీ నాయకుడు ఇచ్చిన పిలుపుతో నిరసనలో పాల్గొనే తీరుతామని కార్యకర్తలు పోలీసులకు తెగేసి చెబుతున్నారు.