గంజాయి ముఠా అరెస్టు
కుప్పం: కుప్పం కేంద్రంగా గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నా ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లులతో మాట్లాడారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినా ఎనిమిది మంది యువకులు గంజాయి బస్తాలతో అనుమానాస్పదంగా కుప్పం పట్టణంలో సంచరిస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారు ఒడిశా రాష్ట్రం కటక్ ప్రాంతం నుంచి కేరళ రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినా హాసిబుల్, నామిజుల్, సౌమిల్ మండల్, సుమన్దాస్, హాసినూర్జమాన్, ముత్తకిమ్మాలిత, కిరణ్ మండల్, మోజూల్ మండల్ ఉన్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ శ్రీరాయులు, ఎస్ఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆక్రమణలు తొలగించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం, విన్జం రెవెన్యూ గ్రామంలో సర్వే నం.296 లో ఉన్న గయాలుకొండ ఆక్రమణలను వెంటనే తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు సోమవారం కలెక్టరేట్కు పంపారు. గయాలుకొండ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే జైలుకెళ్లడం తప్పదని ఉత్తర్వుల్లో న్యాయ స్థానం హెచ్చరించింది. గయాలు కొండ పరిధిలో దాదాపు నాలుగు ఎకరాల మేరకు ఆక్రమణ జరిగినట్లు న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి పూర్తి రికార్డులతో పాటు సంబంధిత భూ స్కెచ్ను కోర్టుకు సమర్పించారు. 1977లో సర్వే నం.296పై సబ్ డివిజన్ జరిగినట్లు, మిగిలిన 45.18 ఎకరాల భూమి గయాలు భూమిలో కొండ ప్రాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ భూమిలో కొంత భాగం కొందరు ఆక్రమించినట్లు కోర్టుకు తెలియజేశా రు. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టు ప్రాంతంలోని ఓ ఖాళీ ప్రదేశంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి టీ షర్ట్, నీలిరంగు లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తాలూకా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు.
కళ్లల్లో కారంకొట్టి..
బంగారు ఆభరణాల చోరీకి యత్నం
కార్వేటినగరం: మహిళల కళ్లల్లో కారప్పొడి చల్లి బంగారు ఆభరణాలు చోరీ చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కథనం.. మండలంలోని కత్తెరపల్లి గ్రామానికి చెందిన వాసు కొన్నాళ్లుగా జల్సాలకు అలవాటు పడి అప్పులు చేయడం ప్రారంభించాడు. వాటిని తీర్చే దారి లేక దొంగతనాలను ఎంచుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం, ములబాగిల్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహుతులతో కలసి దారిలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను అటకాయించేవాడు. వారి కళ్లల్లో కారం చల్లి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లేవారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కత్తెరపల్లి గ్రామానికి పొన్నగల్లు మధ్యలో ఉన్న చెరువు కట్ట పై కాపుకాచారు. అదే సమయంలో పళ్లిపట్టు నుంచి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు స్కూటీలో వెళుతున్న ముగ్గురు మహిళలను ఆటకాయించి వారి కళ్లల్లో కారం చల్లారు. ఆపై వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించడానికి యత్నించారు. అయితే స్కూటీ నడుపుతున్న మహిళకు కంటి అద్దాలు ఉండడంతో కంట్లో కారప్పొడి పడలేదు. దీంతో తప్పించుకుని పారిపోయారు. ఆపై డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువు కట్టపై పడి ఉన్న కారం పొడిని గుర్తించారు. తర్వాత వాసు పై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అతనికి సహకరించిన ములబాగిల్కు చెందిన మురుగన్, శేఖర్తో పాటు గుర్తుతెలియని మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు పోలీసులు పేర్కొన్నారు.


