
పుత్తూరులో పట్టపగలు దోపిడీ
● మార్వాడీ షాపులో రూ.6.30 లక్షలు దోచుకొన్న దొంగలు ● షాపు యజమానిని కత్తులతో గాయపరిచి దోపిడీకి పాల్పడిన వైనం ● మోటార్ సైకిల్పై పరారైన ముగ్గురు అగంతకులు ● ముగ్గురూ 25 ఏళ్ల లోపు యువకులే
పుత్తూరు : ఓ మార్వాడీ షాపులోకి ముగ్గురు అగంతకులు చొరబడి షాపు యజమానిని గాయపరిచి రూ.6.30 లక్షలు దోచుకెళ్లిన ఘటన పుత్తూరు పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకొంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణంలో నివాసం ఉండే రంజిత్జీ అనే మార్వాడీ స్థానిక నగరి రోడ్డులో కొంత కాలంగా మీనాక్షి ఏజెన్సీని నడుపుతున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు రంజిత్జీ కుమారుడు మహేంద్రకుమార్ (28) షాపును తెరిచాడు. ముందుగా వచ్చిన ఒక కస్టమర్కు రూ.2 లక్షలకు పాన్ మసాలా సరుకును విక్రయించాడు. అనంతరం పిచ్చాటూరు నుంచి వచ్చిన మరో కస్టమర్ ఠాగూర్(24) అతని డ్రైవర్ ఏలుమలైలు రూ.4.30 లక్షలు చెల్లించి పాన్ మసాలా సరుకును వ్యాన్లోకి లోడ్ చేశారు. అదే సమయానికి షాపు ముందు బుల్లెట్ మోటార్ సైకిల్పై 25 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు వచ్చి ఆగారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బైక్ పైనే ఉండగా ఇద్దరు దిగి వచ్చి మహేంద్ర కుమార్ను గల్లాలోని డబ్బు ఇవ్వాలంటూ కత్తులు చూపి బెదిరించారు. గల్లాలో ఏమీ లేదంటూ చెప్పడంతో మహేంద్ర కుమార్ను భుజంపై కత్తితో దాడి చేశారు. అడ్డువచ్చిన షాపు అసిస్టెంట్ సునీల్ను మరో యువకుడు కత్తితో కాలిపై గాయపరిచాడు. వెంటనే గల్లాలోని డబ్బు బ్యాగ్ను తీసుకోవడంతో పాటు మహేద్రకుమార్, సునీల్ వద్ద నుంచి సెల్ ఫోన్లను లాక్కొని మోటార్సైకిల్పై ముగ్గురూ పరారయ్యారు. వెంటబడిన మహేంద్రకుమార్ షాపు సమీపంలోని ఆర్డీఎం గేట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సీఐ సురేంద్రనాయుడు అప్రమత్తం అయ్యి మహేంద్రకుమార్, సునీల్ ఫోన్ నంబర్లను టేస్వుట్ చేయగా అవి స్థానిక చర్చి కాంపౌండ్ వద్ద లొకేషన్ను చూపాయి. అక్కడికి చేరుకొన్న సీఐకి రెండు సెల్ ఫోన్లు అక్కడ లభ్యమయ్యాయి. దుండగులు ఫోన్లను అక్కడ పడేసి పరారైనట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కస్టమర్ ఠాగూర్తో పాటు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారి కాల్ డేటాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ సరేంద్రనాయుడు వెల్లడించారు.