● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మాఫియాగా కొందరు కూటమి నేతలు ● ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం ● ప్రతి నెలా రూ.లక్షల్లో దందా ● డీలర్‌ షాపుల నుంచే అక్రమాలు ఆరంభం ● 9 నెలల్లో 807.09 క్వింటాళ్ల బియ్యం పట్టివేత ● చోద్యం చూస్తున్న జిల్లా ప | - | Sakshi
Sakshi News home page

● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మాఫియాగా కొందరు కూటమి నేతలు ● ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం ● ప్రతి నెలా రూ.లక్షల్లో దందా ● డీలర్‌ షాపుల నుంచే అక్రమాలు ఆరంభం ● 9 నెలల్లో 807.09 క్వింటాళ్ల బియ్యం పట్టివేత ● చోద్యం చూస్తున్న జిల్లా ప

Mar 19 2025 12:32 AM | Updated on Mar 19 2025 12:31 AM

కాణిపాకం : జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నేతలే అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తి దందాను నడిపిస్తున్నారు. పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం వ్యాపారులకు అధిక ధరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పోలీసుల కంట్లో పడడంతో బియ్యం అక్రమ వ్యాపా రం బట్టబయలవుతోంది. 9 నెలల కాలంలో అక్రమంగా నిల్వలు, తరలిస్తున్న 807.9 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం అక్రమార్కులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 5.40 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా అందించేందుకు 15 వేల టన్నుల రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. అయితే, రేషన్‌ తీసుకుంటున్న వారిలో 50 శాతం మంది బియ్యాన్ని వినియోగించడం లేదు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పేదల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.17 వరకూ కొనుగోలు చేస్తున్నారు. వారు ఈ బియ్యాన్ని మిల్లర్లకు కేజీ రూ.20కు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే చిరు వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకూ కమీషన్లలో మునిగి తేలుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రేషన్‌ దందా జిల్లాలో పెచ్చుమీరింది. కూటమి నేతలు కొందరు పేదల బియ్యాన్ని అక్రమ వ్యాపారంగా మలుచుకున్నారు. డైరెక్టుగా డీలర్‌లతో డీల్‌ కుదుర్చుకుని కూటమి నేతలు అక్రమ వ్యాపారాన్ని దర్జాగా నడిపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకకు తరలిస్తూ..లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు.

పోలీసులు పట్టుకుంటే.. పంచనామాకే పరిమితం

9 నెలల కాలంలో జిల్లా నలుమూల నుంచి భారీగా రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో 28 కేసులు నమోదు కాగా 807.91 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళుతున్న సమయంలో పోలీ సులు పట్టుకుంటున్నారు. లేకుంటే స్థానికుల సమాచారంతో భారీ నిల్వలను గుర్తించి కేసులు పెడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టుకున్నా కేసులు పెట్టేందుకు జంకుతున్నారు. కేవలం పంచనామా రాసి వెళ్లిపోతున్నారు. డీలర్ల నుంచే ఈ దందా నడుస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్‌ మాఫియాపై కొరడా ఝలిపిస్తేతప్ప దందాకు అడ్డుకట్ట పడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా సమాచారం

కార్డుదారుల సంఖ్య: 5.40 లక్షలు

బియ్యం సరఫరా ప్రతినెలా: 15 వేల టన్నులు

కిలో బియ్యం బయట

అమ్ముతున్న ధర:

రూ. 10 నుంచి రూ.17 వరకు

నెలనెలా అక్రమంగా వెళుతున్న బియ్యం:

5 వేల టన్నుల నుంచి 8 వేల టన్నుల వరకు

మిగులు ఇలా..

కార్డుదారులకు రేషన్‌ ఇవ్వకుండా, డీలర్లే డబ్బులకు విక్రయించడం

తూకంలో కోతలు, డబ్బాలు పెట్టి రేషన్‌ పంపిణీ

ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సేకరించడం

పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం కొందరి కూటమి నేతల జేబులు నింపుతున్నాయి. ఈ దందాకు కొంత మంది రేషన్‌ డీలర్లే లోపాయికారిగా సహకరిస్తుండడంతో రేషన్‌ దందా రాష్ట్రం సరిహద్దులు దాటిపోతున్నాయి.. ఈ బియ్యం సైక్లింగ్‌ అయి తిరిగీ సన్నబియ్యంగా మన మార్కెట్‌లోకి దూసుకొస్తున్నాయి. రేషన్‌ దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇందులో ఎవరి వాటాలు వారికి ఉండడంతో రేషన్‌ దందా యథేచ్ఛగా సాగిపోతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

రేషన్‌ పట్టుకున్న వివరాలు ఇలా నెల 6ఏ పట్టుబడ్డ బియ్యం కేసులు క్వింటాళ్లల్లో.. జూన్‌

2024 1 6.16

ఆగష్టు 8 131.9

సెప్టెంబర్‌ 6 93.98

అక్టోబర్‌ 1 24.1

నవంబర్‌ 3 18.65

డిసెంబర్‌ 4 316.56

ఫిబ్రవరి–25 3 110.99

మార్చి–25 2 104.57

సరిహద్దు ప్రాంతాలే..

అక్రమ రేషన్‌ వ్యాపారానికి జిల్లాలోని పలమనేరు, చిత్తూరు, బంగారుపాళ్యం, యాదమరి, గుడిపాల, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, నగరి, పుంగనూరు, కుప్పం, శాంతిపురం ప్రాంతాలు కేంద్ర బిందువుగా మారాయి. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లారీలు, ఆటోల ద్వారా యథేచ్ఛగా సరిహద్దులు దాటుతున్నాయి.

సన్నబియ్యంగా తిరిగీ మార్కెట్లోకి...

రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సన్న బియ్యంగా చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్‌న బియ్యాన్ని సోనా మసూరి వంటి బ్రాండెడ్‌ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మర పట్టడంతో వినియోగదారులు గుర్తించలేక మోసపోతున్నారు. అటు తూకం దగ్గర సైతం ఇదే పరిస్థితి. 25 కిలోలు ఉండే ప్యాకెట్‌లో ఉండేది 23 కిలోలే. రెండు కిలోలు తరుగును చూపిస్తుంటారు. ఇటు బియ్యం నకిలీతో పాటు తూకంలో సైతం వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతలు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఎవరు చేసినా వదిలిపెట్టం

రేషన్‌ దందా ఎవరు చేసిన వదిలిపెట్టం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. డీలర్లు చేసినా కేసులు పెడుతాం. ఇప్పటికే చాలా కేసులు పెట్టాం. రేషన్‌ బియ్యంతో అక్ర మ వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టం. ఎక్కడైనా నిల్వలు ఉంటే చెప్పండి పట్టుకుంటాం. కేసులు పెడుతాం.

– శంకరన్‌, డీఎస్‌ఓ, చిత్తూరు

● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మా1
1/2

● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మా

● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మా2
2/2

● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్‌ ! ● రేషన్‌ మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement