టీసీఎస్‌కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా | TCS fined Rs 1600 crore by US court for Misappropriation | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా - ఎందుకంటే?

Jun 16 2024 7:10 AM | Updated on Jun 16 2024 6:20 PM

US Court Rs 1600 Crore Penal Charges On TCS for Misappropriation

తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్‌లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్‌లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.

ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.

ఆన్‌బోర్డింగ్ ఆలస్యం
ఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్‌లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement