క్యూ4 లాభం 31 శాతం డౌన్
రూ. 5,878 కోట్లకు పరిమితం
ముంబై: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 5,878 కోట్లకు పరిమితమైంది. 2024–25 ఇదే కాలంలో రూ. 8,586 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం బలపడి రూ. 1.05 లక్షల కోట్లను తాకింది.
జేఎల్ఆర్ తీరిలా: క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 11 శాతం క్షీణించి 6.9 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. నికర లాభం 64 కోట్ల పౌండ్ల నుంచి 36.5 కోట్ల పౌండ్లకు భారీగా వెనకడుగు వేసింది. కొత్త జాగ్వార్ విడుదల నేపథ్యంలో జేఎల్ఆల్ఆర్ మోడళ్లను తగ్గించడం, చైనాలో ఆటోమోటివ్ పరిశ్రమలో పోటీ వాతావరణం ప్రభావం చూపాయి. దీంతో జేఎల్ఆర్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 95,300 యూనిట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో 1,11,400 యూనిట్లు విక్రయించింది. కాగా.. టాటా పీవీ ఆదాయం 49 శాతం జంప్చేసి రూ. 18,700 కోట్లను తాకింది. ఈవీలుసహా మొత్తం వాహన విక్రయాలు 37 శాతం ఎగసి తొలిసారి 2,01,800 యూనిట్లకు చేరాయి.


