ర్యాలీతో రికార్డుల మోత  | Sensex Ends Volatile Session 349 Points Up and Nifty At Record High Of 22197 | Sakshi
Sakshi News home page

ర్యాలీతో రికార్డుల మోత 

Feb 21 2024 4:00 AM | Updated on Feb 21 2024 4:00 AM

Sensex Ends Volatile Session 349 Points Up and Nifty At Record High Of 22197 - Sakshi

ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలలో కొనుగోళ్ల మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో మరోసారి మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 22,197 వద్ద ముగిసింది. దీంతోపాటు ఇంట్రాడేలో 22,216కు చేరడం ద్వారా మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మరోపక్క సెన్సెక్స్‌ 349 పాయింట్లు జంప్‌చేసి 73,057 వద్ద నిలిచింది. తద్వారా 73,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించడంతోపాటు.. చరిత్రాత్మక గరిష్టం 73,328ను అధిగమించే బాటలో సాగుతోంది. సోమవారం సైతం నిఫ్టీ 22,122 వద్ద రికార్డ్‌ సృష్టించిన విషయం విదితమే. అయితే మార్కెట్లు తొలుత వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 22,046 దిగువన, సెన్సెక్స్‌ 72,510 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తిరిగి మిడ్‌ సెషన్‌ నుంచీ జోరందుకున్నాయి. దీంతో ఆరు రోజుల్లో నిఫ్టీ 580 పాయింట్లు, సెన్సెక్స్‌ 1,984 పాయింట్లు జమ చేసుకున్నాయి.  

ప్రయివేట్‌ స్పీడ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌(1%) జోరు చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎన్‌టీపీసీ, కొటక్, ఎస్‌బీఐ లైఫ్, బీపీసీఎల్, ఇండస్‌ఇండ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్‌యూఎల్‌ 4.4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరోమోటో, బజాజ్‌ ఆటో, ఐషర్, కోల్‌ ఇండియా, టీసీఎస్, సిప్లా, బజాజ్‌ ఫిన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 4–1% మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు వీక్‌ 
అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు చిన్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,967 నీరసించగా.. 1,876 బలపడ్డాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1,491 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. 

స్టాక్‌ హైలైట్స్‌..
► ఇష్యూ ధర రూ. 151తో పోలిస్తే వి¿ోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ 179% లాభంతో రూ. 421 వద్ద లిస్టయ్యింది. 193% (రూ.291) బలపడి రూ. 442 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 838 కోట్లను దాటింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో 23.3 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీవో భారీ స్థాయిలో 300 రెట్లు సబ్‌్రస్కయిబ్‌ అయ్యింది. 
► ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుల్లో రూ. 656 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించడంతో పవర్‌గ్రిడ్‌ షేరు 4.2% ఎగసి రూ. 288 వద్ద క్లోజైంది.

వరుసగా ఆరో రోజూ ర్యాలీతో దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డును సాధించగా.. సెన్సెక్స్‌ 73,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. త ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకునే బాట లో సాగుతోంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల విలువ రూ. 391.5 లక్షల కోట్ల(4.72 ట్రిలియన్‌ డాలర్లు)ను తాకింది. 

వర్ల్‌పూల్‌ వాటా విక్రయం.. రూ. 4,090 కోట్ల సమీకరణ 
రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్‌ సంస్థ వర్ల్‌పూల్‌ మారిషస్‌ బ్లాక్‌డీల్స్‌ ద్వారా దేశీ అనుబంధ కంపెనీ వర్ల్‌పూల్‌ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించింది. యూఎస్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ దిగ్గజం వర్ల్‌పూల్‌ కార్పొరేషన్‌ మారిషస్‌ సంస్థ ద్వారా 75 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. బ్లాక్‌డీల్స్‌ ద్వారా రూ. 4,090 కోట్ల విలువైన 3.13 కోట్ల షేర్లు విక్రయించినట్లు బీఎస్‌ఈకి వర్ల్‌పూల్‌ ఇండియా వెల్లడించింది. రుణ చెల్లింపుల కోసం వర్ల్‌పూల్‌ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించనున్నట్లు గతేడాది వర్ల్‌పూల్‌ కార్ప్‌ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వర్ల్‌పూల్‌ ఇండియా షేరు 3.25 శాతం క్షీణించి రూ. 1,288 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement