నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు! | From Poverty to Global Talent Hub zoho Sridhar Vembu Journey India Transformation | Sakshi
Sakshi News home page

నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!

Apr 24 2026 2:15 PM | Updated on Apr 24 2026 2:21 PM

From Poverty to Global Talent Hub zoho Sridhar Vembu Journey India Transformation

‘1980వ దశకంలో దేశం విడిచి వెళ్లేటప్పుడు నా మనసులో ఒకటే ప్రశ్న.. మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం? కానీ నేడు అదే భారత్ ప్రపంచానికి టాలెంట్ హబ్‌గా మారింది. ఒకప్పుడు సంస్థను స్థాపించడం గగనమైతే, నేడు అది అత్యంత సులభతరమైంది’ ఇవి ప్రముఖ ఐటీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యక్తం చేసిన భావాలు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న తన జీవిత అనుభవాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

నిరాశ నిండిన కాలం అది..

శ్రీధర్ వెంబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, 1989లో తాను ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాలు అశాంతితో రగులుతుండేవన్నారు. ‘అప్పట్లో ఐఐటీయన్లు దేశం దాటి వెళ్లడమే ఏకైక మార్గంగా భావించేవారు. నేను దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను గుర్తుచేశారు.

వృథా అవుతున్న ప్రతిభ

ఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ వెంబు దృష్టి అంతా ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రంపైనే ఉండేది. ‘మనం ఎందుకు పేదవాళ్లం?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన దశాబ్దాల పాటు అన్వేషించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారతదేశం పేద దేశంగా ఉండటానికి కారణం మనం మన ప్రతిభను భారీ స్థాయిలో వృథా చేయడమే’ అని విశ్లేషించారు. జోహో సంస్థను ఏ గొప్ప నేపథ్యం లేని సామాన్య భారతీయులతోనే నిర్మించామని, అటువంటి ప్రతిభ భారత్‌లో ప్రతిచోటా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టాలెంట్‌ను సరైన దిశలో ఉపయోగిస్తే దేశం అద్భుతమైన సంపదను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంస్కరణల పర్వం

1989 నాటికే తాను సోషలిస్టు విధానాలకు వ్యతిరేకిగా మారానని వెంబు తెలిపారు. 1991 సంక్షోభం సమయంలో విదేశీ మారక నిల్వలు అడుగంటి, ఐఎంఎఫ్ వద్ద బంగారం కుదువ పెట్టాల్సిన దుస్థితి నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వరకు ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ పతనం, చైనాలో అశాంతి వంటి అంశాలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని చెప్పారు.

నేటి భారతం అవకాశాల గని

ప్రస్తుత పరిస్థితులపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సంస్థను ప్రారంభించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించవచ్చని ఆయన ఉదహరించారు. ‘మనం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన జీవన ప్రమాణాలు ఉన్న చోట నుంచి కూడా కంపెనీలను మొదలు పెట్టవచ్చు. మీ దగ్గర ప్రతిభ ఉంటే భారతదేశంలో ఏదైనా సాధించవచ్చు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement