బంగారం దిగుమతులపై పరిమితి!
ఆభరణ ఎగుమతిదారులకు వర్తింపు
నిబంధనల అమలు మరింత కఠినతరం
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన మరుసటి రోజే.. పసిడి దిగుమతులపైనా పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద ఆభరణాల ఎగుమతిదారులకు సున్నా సుంకంపై పసిడి దిగుమతిని 100కిలోలకు పరిమితం చేస్తున్నట్టు వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది.
ఈ పథకం కింద 100 కిలోలకు మించి తదుపరి పసిడి దిగుమతుల కోసం అనుమతి కావాలంటే.. అప్పటికే కనీసం 50 శాతం ఎగుమతులను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకుముందు వరకు ఈ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులు సున్నా సుంకంపై అపరిమితంగా పసిడి దిగుమతులకు అనుమతి ఉంది. ఆభరణాల ఎగుమతులకు ప్రోత్సాహకంగా దీన్ని తీసుకొచ్చారు. ఆభరణాల ఎగుమతులకు వినియోగించే ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధనం, ఆయిల్ తదితర వాటికీ సున్నా సుంకం ప్రయోజనాలున్నాయి.
తాజా చర్యతో ఆభరణాల ఎగుమతులకు సంబంధించిన బంగారం దిగుమతులను సైతం క్రమబద్దీకరించేందుకు కేంద్రం నడుం బిగించినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ పథకం కింద మొదటిసారి దిగుమతులకు దరఖాస్తు చేసుకుంటే, తయారీ ప్లాంట్, సామర్థ్యాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నట్టు డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. దిగుమతి చేసుకున్న పసిడిని నిబంధనలకు అనుగుణంగా కచి్చతంగా ఆభరణాల ఎగుమతులకు వినియోగించేలా చూడడం, దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే తాజా చర్యల ఉద్దేశంగా కనిపిస్తోంది.


