అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.
1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.
ఏఐ బూమ్తో పెరిగిన విలువ
గత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.
రూ.634 కోట్ల డీల్
2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది.


