ఫండ్స్‌ కోసం పబ్లిక్‌ ఇష్యూ బాట | latest IPOs Coming Soon in stock market | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ కోసం పబ్లిక్‌ ఇష్యూ బాట

Jun 20 2025 10:20 AM | Updated on Jun 20 2025 12:00 PM

latest IPOs Coming Soon in stock market

క్యాపిల్లరీ టెక్నాలజీస్‌, పీఎన్‌జీఎస్‌ రెవా డైమండ్‌ రెడీ..

సాస్‌(ఎస్‌ఏఏఎస్‌) సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.83 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయాలకు, ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్‌ సంబంధ రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్‌మెంట్‌కు రూ. 152 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రూ.10 కోట్లు కంప్యూటర్‌ సిస్టమ్స్‌ కొనుగోలుకి, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. 

ఇంతక్రితం 2021 డిసెంబర్‌లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి లభించలేదు. కంపెనీ ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లౌడ్‌నేటివ్‌ సాస్‌ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 598 కోట్లను తాకింది. టర్న్‌అరౌండ్‌ సాధించి రూ. 13 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ. 59 కోట్ల నష్టాలు ప్రకటించింది.

పీఎన్‌జీఎస్‌ రెవా డైమండ్‌ సెబీకి దరఖాస్తు

న్యూఢిల్లీ: రిటైల్‌ జ్యువెలరీ కంపెనీ పీఎన్‌జీఎస్‌ రెవా డైమండ్‌ జ్యువెలరీ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 289 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. 2028కల్లా కొత్తగా 15 స్టోర్లను తెరిచే ప్రణాళికల్లో ఉంది. ఈ బాటలో ప్రధాన బ్రాండు ‘రెవా’ మార్కెటింగ్, ప్రమోషనల్‌ కార్యక్రమాల కోసం రూ. 35 కోట్లకుపైగా వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. 

ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్‌ఎంఈలు

ప్రమోటర్‌ పీఎన్‌ గాడ్గిల్‌ అండ్‌ సన్స్‌ స్లంప్‌ సేల్‌ ద్వారా డైమండ్‌ బిజినెస్‌ను విక్రయించడంతో కంపెనీ ఆవిర్భవించింది. దీంతో పీఎన్‌జీఎస్‌ రెవా ప్రత్యేక కంపెనీగా సొంత గుర్తింపుతో డైమండ్‌ జ్యువెలరీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 మార్చి31కల్లా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో 33 స్టోర్లను కలిగి ఉంది. గతేడాది(2024–25) ఆదాయం 32 శాతం ఎగసి రూ. 258 కోట్లను తాకగా.. నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ.59 కోట్లను అధిగమించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement