మళ్లీ ఐపీవోల సందడి..! | IPO market in 2025 showing significant activity | Sakshi
Sakshi News home page

మళ్లీ ఐపీవోల సందడి..!

Apr 30 2025 8:17 AM | Updated on Apr 30 2025 8:17 AM

IPO market in 2025 showing significant activity

టారిఫ్‌లపరమైన అనిశ్చితితో ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ మరిన్ని కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌లో భాగమైన ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ వెంచర్స్, కెనరా రోబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్, అర్బన్‌ కంపెనీ  తమ ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచాయి. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ వెంచర్స్, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 1,000 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌హోల్డరయిన ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ విక్రయించనుంది. దేశీయంగా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో ఒకటైన ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ .. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హౌసింగ్, ఆఫీస్, రిటైల్, హోటల్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024 డిసెంబర్‌ 31 నాటికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 1,445 గదులతో ఏడు హోటల్స్‌ ఉన్నాయి. వీటిలో 1,255 గదుల ప్రాజెక్టులు ఇప్పటికే నిర్వహణలో ఉండగా, 190 గదుల ప్రాపర్టీ ప్రస్తుతం రెనోవేషన్‌లో ఉంది. అదనంగా 951 గదులకు సంబంధించి మూడు హాస్పిటాలిటీ అసెట్స్‌ నిర్మాణం కొనసాగుతోంది.  

ఓఎఫ్‌ఎస్‌గా కెనరా రోబెకో..

కెనరా రోబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కూడా ఐపీవోకి సంబంధించి ప్రాస్పెక్టస్‌ను సెబీకి సమర్పించింది. ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉండనుంది. ప్రమోటర్‌ సంస్థలు కెనరా బ్యాంక్, ఓరిక్స్‌ కార్పొరేషన్‌ (గతంలో రోబెకో గ్రూప్‌ ఎన్‌వీ) వరుసగా 2.59 కోట్లు, 2.39 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. ఇందులో కెనరా బ్యాంకునకు 51 శాతం వాటాలు ఉండగా, మిగతావి ఓరిక్స్‌ కార్పొరేషన్‌కి ఉన్నాయి. పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ రూపంలో ఉండటం వల్ల ఇష్యూ ద్వారా సమీకరించే నిధులేవీ కంపెనీకి దక్కవు. కెనరా రోబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 1993లో ఏర్పాటైంది. ప్రధానంగా మ్యుచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ, దేశీ ఈక్విటీలకు సంబంధించి పెట్టుబడుల సలహాల సేవలు అందిస్తోంది. గతేడాది డిసెంబర్‌ 31 నాటికి 12 ఈక్విటీ స్కీములు, 10 డెట్‌ పథకాలు, మూడు హైబ్రిడ్‌ స్కీములు కలిపి మొత్తం 25 స్కీములను నిర్వహిస్తోంది. ఈ ఇష్యూకి ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, యాక్సిస్‌ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్‌ సంస్థలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.  

కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ లిస్టింగ్‌ బాట

కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఇటీవలే కెనరా రొబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కెనరా రొబెకో ఏఎంసీ తరహాలోనే కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ సైతం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్‌ 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో కెనరా బ్యాంక్‌ 13.77 కోట్ల షేర్లు, హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్‌(ఆసియా పసిఫిక్‌) హోల్డింగ్స్‌ 47.5 లక్షల షేర్లు చొప్పున ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ బాటలో పీఎస్‌యూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 9.5 కోట్ల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ను 51 శాతం వాటాతో కెనరా బ్యాంక్, 26 శాతం వాటాతో హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్‌(ఆసియా పసిఫిక్‌) హోల్డింగ్స్‌ భాగస్వామ్య సంస్థ(జేవీ)గా 2007లో ఏర్పాటు చేశాయి.

అర్బన్‌ కంపెనీ.. రూ.1,900 కోట్లు

యాప్‌ ఆధారిత బ్యూటీ, హోమ్‌ కేర్‌ సరీ్వసుల సంస్థ అర్బన్‌ కంపెనీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 429 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ. 1,471 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇందులో యాక్సెల్‌ ఇండియా, ఎలివేషన్‌ క్యాపిటల్, బెస్సీమర్‌ ఇండియా క్యాపిటల్‌ హోల్డింగ్స్‌ టూ, ఇంటర్నెట్‌ ఫండ్‌ ఫైవ్, వీవైసీ11 మొదలైనవి ఉన్నాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 190 కోట్లను కొత్త టెక్నాలజీ, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలపై, రూ. 70 కోట్ల మొత్తాన్ని ఆఫీసుల లీజుల చెల్లింపుల కోసం, రూ. 80 కోట్లు మార్కెటింగ్‌ కార్యకలాపాల కోసం, మిగతాది కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.

ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..


ట్రావెల్‌ ఫుడ్‌... రూ. 2,000 కోట్ల సమీకరణకు రెడీ

క్విక్‌ సర్వీసు రెస్టారెంట్లు(క్యూఎస్‌ఆర్‌), వివిధ విమానాశ్రయాలలో లాంజ్‌ బిజినెస్‌ నిర్వహించే ట్రావెల్‌ ఫుడ్‌ సరీ్వసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ కపూర్‌ కుటుంబ ట్రస్ట్‌ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. వీటిని ప్రమోటర్లు అందుకోనున్నారు. కాగా.. 2024 డిసెంబర్‌లో ట్రావెల్‌ ఫుడ్‌ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. 2009లో తొలి క్యూఎస్‌ఆర్‌ ఔట్‌లెట్‌ ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతాసహా 14 ఎయిర్‌పోర్టులలో విస్తరించింది. మలేసియాలోనూ మూడు విమానాశ్రయాలలో సరీ్వసులు అందిస్తోంది. సొంత బ్రాండ్లతోపాటు.. దేశ, విదేశీ బ్రాండ్లతో విభిన్న పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. లండన్‌లో లిస్టయిన ఎస్‌ఎస్‌పీ గ్రూప్, కపూర్‌ కుటుంబ ట్రస్ట్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement