ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత.. | Indian Banks Reduce Savings Account Interest Rates | Sakshi
Sakshi News home page

ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..

Apr 19 2025 8:51 AM | Updated on Apr 19 2025 9:49 AM

Indian Banks Reduce Savings Account Interest Rates

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసిన నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. లాభాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రధాన భారతీయ బ్యాంకులు ఇటీవల సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. కాసా (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) ఖాతాలు క్షీణించడం, డిపాజిట్ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని నియంత్రించడానికి, నికర వడ్డీ మార్జిన్లను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.

ప్రధాన బ్యాంకుల్లో రేట్ల సవరణలు

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.50 లక్షల లోపు సేవింగ్స్‌ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును 2.75 శాతానికి, దానికంటే అధిక బ్యాలెన్స్‌పై 3.25 శాతానికి చేర్చింది.

  • రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా డిపాజిట్లపై 2.7% వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తుంది. ఇందులో అక్టోబర్‌ 2022 నుంచి ఎలాంటి మార్పులేదు.

  • ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 లక్షల లోపు పొదుపు ఖాతాలోని బ్యాలెన్స్‌పై 2.75 శాతం, దాని కంటే అధిక మొత్తాలకు 3.25 శాతం వడ్డీ రేట్లను సవరించింది.

  • డిపాజిట్ వ్యయాలను తగ్గించడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మాదిరిగానే వడ్డీ రేట్లను సర్దుబాటు చేసింది.

రేట్ల కోతకు కారణం

మారుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ చర్యలు తీసుకున్నాయి. బ్యాంకుల్లో కాసా(కరెంట్‌ ఖాతా సేవింగ్స్‌ ఖాతా) నిష్పత్తులు తగ్గుతున్నాయి. ఉన్న పొదుపు ఖాతాల్లో నగదు జమ భారీగా క్షీణిస్తోంది. ఇది బ్యాంకులకు తక్కువ ఖర్చుతో కూడిన నిధులను నిర్వహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాతాదారులు అధిక వడ్డీ రేట్లతో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎక్కువగా ఎంచుకోవడంతో సేవింగ్స్‌ ఖాతాల వృద్ధి తగ్గిపోయింది. వీటికితోడు ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్‌ చేసింది. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించాయి.

ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్‌ 10 మొబైళ్లు

డిపాజిటర్లకు మార్గాలు..

బ్యాంకుల వడ్డీ తగ్గింపు నిర్ణయాలతో పొదుపు ఖాతాదారులు తమ డిపాజిట్లపై తక్కువ రాబడిని పొందుతారు. అయితే అధిక రాబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో నగదు మళ్లించడం మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. డిపాజిటర్లు తమ నగదును దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే ఈక్విటీ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌లు, రియల్‌ ఎస్టేట్‌, బంగారం.. వంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని చెబుతున్నారు. మంచి ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement