
రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 16 శాతం తగ్గిపోయాయి. 2,263 మిలియన్ డాలర్ల (19,261 కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 2,688 మిలియన్ డాలర్లు (రూ.22,414 కోట్లు)గా ఉన్నట్టు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. అమెరికా టారిఫ్ల అనంతరం వీటి ఎగుమతులు తగ్గిపోవడం గమనార్హం.
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 35 శాతం తక్కువగా 950 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 12,272 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
పాలిష్డ్ ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు సైతం 33 శాతం తగ్గి 81 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 17 శాతం పెరిగి 997 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది మే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 851 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
వెండి ఆభరణాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలల్లో 17 శాతానికి పైగా క్షీణించి 150 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
కలర్డ్ జెమ్స్టోన్ ఎగుమతులు ఏప్రిల్–మే నెలల్లో ఒక శాతం తగ్గి 62 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్
అమెరికా టారిఫ్ల వల్లే..
‘అమెరికా టారిఫ్ల వల్ల మొత్తం మీద ఎగుమతులు మే నెలలో 16 శాతం వరకు తగ్గాయి. అయినప్పటికీ బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం బంగారానికి డిమాండ్ను పెంచింది’ అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు.