టాక్స్‌ ఆడిట్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు.. | Important Suggestions and Key facts About Audit | Sakshi
Sakshi News home page

టాక్స్‌ ఆడిట్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు..

Jan 31 2022 9:14 AM | Updated on Jan 31 2022 9:16 AM

Important Suggestions and Key facts About Audit - Sakshi

టాక్స్‌ ఆడిట్‌ గురించి ఇప్పటికే  తెలుసుకున్నాం.. ఈ వారం ఎలా చేయించాలో తెలుసుకోండి. 
- ముందుగా ఆర్ధిక సంవత్సరం చివరికి టర్నోవరు లేదా అమ్మకాలు లేదా బ్యాంకులో వసూళ్లు విలువ తెలుసుకోండి. చివరి దాకా వేచి ఉండక్కర్లేదు. మీ అనుభవం .. వ్యాపార సరళి, జీఎస్‌టీ రికార్డులను బట్టి తెలుస్తుంది. టర్నోవరు కోటి రూపాయలు దాటింది అంటే మీ కేసు టాక్స్‌ ఆడిట్‌ పరిధిలోనిది అన్నమాట. 
- వెంటనే ఒక ప్రాక్టీస్‌ లో ఉన్న సీఏని సంప్రదించండి. 
- సదరు సీఏని అపాయింట్‌ చేసుకోండి. అలాగే ఫీజు కూడా ముందుగానే పేర్కొనండి. 
- సీఏని మీరే నియమించినా ఆ వ్యక్తి ఇటు మీ తరఫున అటు ఇన్‌కం ట్యాక్స్‌ విభాగం తరఫున తన విధులకు న్యాయం చేస్తారు. 
- ఏం చేయాలన్నది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. 
- ఆడిట్‌ పరిధిలో ఏయే రికార్డులు వెరిఫై చేయాలన్నది ప్రస్తావించారు. 
- ఒక అస్సెస్సీకి సంబందించిన వందలాది అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశం మీద రిపోర్ట్‌ ఇవ్వాలి. 
- ఉదాహరణకు వ్యాపారంలో సొంత ఖర్చులు ఉన్నాయా? క్యాపిటల్‌ ఖర్చులు మామూలు ఖర్చుల్లో కలవడం జరగలేదు కదా? బిజినెస్‌కి సంబంధం లేని ఖర్చులు విడిగా రాయడం చేశారా? సొంత వాడకాన్ని విడిగా చూపించారా? విరాళాలు విడిగా రాశారా? ఇలాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. 
- పైవన్నీ తప్పు అని అనటం లేదు... కొన్ని వ్యాపారాల్లో చాలా సహజం... జరిగింది జరిగినట్లు రాయండి.. ఆడిటర్‌ ఆ వ్యవహారాలను జల్లెడ బట్టి తన వృత్తి నైపుణ్యంతో విడగొడతారు. 
- ఆదాయాన్ని, ఖర్చులను సరిగ్గా నిర్ధారించడంపైనే ఈ ఆడిట్‌ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కొన్ని విధులు సరిగ్గా నిర్వహించడం జరిగిందా లేదా అన్నది రిపోర్ట్‌ చేస్తుంది. ముఖ్యంగా టీడీఎస్‌ లాంటివాటికి సంబంధించి చట్టప్రకారమే ప్రయోజనం పొందారా లేదా అన్నది పరిశీలిస్తుంది. 
- ఇందుకోసం ఆదాయపు పన్ను విభాగం నిర్దేశి ంచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. 
- అప్పుడు పూర్తి అవుతుంది.. ఆడిట్‌.. ఆడిట్‌ రిపోర్ట్‌. 
ఈ రిపోర్ట్‌పై ఇద్దరు సంతకం పెడతారు. దీన్ని గడువు తేదీ లోపల దాఖలు చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ భారీగా వడ్డీస్తారు. ఈ రిపోర్ట్‌ మీకూ శ్రీరామ రక్ష. 31మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఫిబ్రవరి 15 దాకా పొడిగించారు. కాబట్టి కాస్త త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసేసి ఉంటే 31 మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం రిటర్నుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. 
- కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

Advertisement
 
Advertisement
Advertisement