
ముంబై: దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్–2, 3) ఆతిథ్య రంగం జోరుమీదున్నది. ఇందుకు నిదర్శనంగా 2024లో ఆతిథ్య రంగంలో జరిగిన హోటల్ లావాదేవీల్లో సగం ఇక్కడే నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది మొత్తం 25 లావాదేవీలు జరిగినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాపార, విహార ప్రదేశాల్లో హోటల్స్ లావాదేవీలు (కొనుగోలు, విక్రయాలు) ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
దీంతో అమృత్సర్, మధుర, బికనేర్ తదితర నగరాల్లో నాణ్యమైన వసతి సదుపాయాలు పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది. మొత్తం లావాదేవీల్లో 51 శాతం అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు), ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేటు హోటల్ యజమానులు నుంచి ఉన్నట్టు వెల్లడించింది. లిస్టెడ్ హోటల్ కంపెనీల నుంచి 34 శాతం లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నైలో 250 అంతంటే ఎక్కువ గదులున్న హోటల్ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.
ఈ నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, బలమైన డిమాండ్ మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2025 మొదటి త్రైమాసికంలో చెన్నై, గోవాలో ఇప్పటికే రెండు డీల్స్కు జేఎల్ఎల్ సేవలు అందించింది. కార్యకలాపాలు నిర్వహించే వాటితోపాటు భూముల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని ఇవి సూచిస్తున్నాయి’’అని జేఎల్ఎల్ ఇండియా ఎండీ జైదీప్ దంగ్ తెలిపారు.