నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం మేధస్సు, వనరులు ఉంటే సరిపోదు.. అంతకుమించి వేగం అత్యంత అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఒక ఆలోచనాత్మకమైన కోట్ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అతిగా ఆలోచించకండి..
విజయవంతమైన వ్యక్తుల జీవనశైలిని నిశితంగా గమనించిన గోయెంకా వారిలో ఒకే రకమైన సామాన్య లక్షణం కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘విజయవంతమైన వ్యక్తులు అతిగా ఆలోచించరు, అతిగా ప్లాన్ చేయరు లేదా సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు కేవలం ముందుకు సాగిపోతుంటారు. ఇతరులు చర్చలు, పరిశోధనలతో సమయం గడుపుతున్నప్పుడు.. వీరు ఇప్పటికే పని మొదలుపెట్టి, అందులో ఎదురయ్యే సవాళ్లను నేర్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు’ అని ఆయన వివరించారు.
పరిపూర్ణత కంటే కార్యాచరణే మిన్న
చాలామంది పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ నెలల తరబడి సమయాన్ని వృథా చేస్తారని, దానివల్ల అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని గోయెంకా హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అమలు చేసే పరిపూర్ణ ప్రణాళిక కంటే ఈరోజే అమలు చేసే మంచి ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన


