ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉన్నత చదువు అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత చేరువ చేసే దిశగా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని కళాశాల విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా నెలకు రూ.399 చొప్పున, ఏడాదైతే దాదాపు రూ.4,800 విలువ చేసే ఈ ప్రీమియం సేవలను అర్హులైన విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందే వెసులుబాటు కల్పించింది.
ప్రధాన ప్రయోజనాలు.. ఫీచర్లు
ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులకు గూగుల్ అత్యంత సామర్థ్యమున్న ‘జెమిని ఓమ్ని’ (Gemini Omni) మోడల్ యాక్సెస్ లభిస్తుంది. సాధారణ పరిమితుల కంటే రెండు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితితో పాటు ప్రాజెక్టులు, డాక్యుమెంట్ల భద్రత కోసం 400 బీజీ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. చదువును మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ హబ్ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా..
స్టడీ నోట్బుక్స్: అకడమిక్ నోట్స్ లేదా సిలబస్ను అప్లోడ్ చేసి విశ్లేషణాత్మక క్విజ్లు రాయవచ్చు. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి సూక్ష్మ స్థాయి లెసన్ ప్లాన్లను జెమిని సిద్ధం చేస్తుంది.
3డీ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్: కష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు 3డీ మోడల్స్, సిమ్యులేషన్లను సృష్టిస్తుంది.
జెమిని లైవ్, డీప్ రీసెర్చ్: సుదీర్ఘమైన పరిశోధనా నివేదికలను వాయిస్ సంభాషణల ద్వారా చర్చించే సదుపాయం ఉంటుంది.
ఈ ఆఫర్ను ఎలా పొందాలి?
భారత్లోని కాలేజీ విద్యార్థులు గూగుల్ స్టూడెంట్ హబ్ (https://gemini.google.com/students)లోకి వెళ్లి తమ విద్యార్థి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ 12 నెలల ఉచిత ప్లాన్ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. డిజిటల్ లెర్నింగ్ యుగంలో భారతీయ యువతకు ఇది మంచి అవకాశంగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


