బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త రేటును నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలు గడిచిన వారం రోజుల్లో ఎలా మారాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. జనవరి 4 నుంచి జనవరి 11 వరకు బంగారం తో పాటు వెండి ధరల్లో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరల పెరుగుదల ఇలా..
24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 4న రూ.1,35,820 ఉండగా జనవరి 11 నాటికి రూ.1,40,460 లకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4640 పెరిగింది. ఇక జనవరి 4న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 11 నాటికి రూ.1,28,750 లను తాకింది. ఏడు రోజుల్లో రూ.4250 ఎగిసింది.
వెండి దూకుడు
ఇక వెండి ధరలు అయితే బంగారాన్ని మించి అమిత వేగంతో దూసుకెళ్లాయి. వారం రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.18 వేలు పెరిగింది. జనవరి 4న రూ.2,57,000 ఉన్న కేజీ వెండి ధర జనవరి 11 నాటికి రూ.2,75,000 లకు చేరింది.
ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బలపడటం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే వివాహాలు, శుభకార్యాల నేపథ్యంలో నగలపై డిమాండ్ పెరగడం కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వెండిపై పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని అంటున్నారు.


