గీతా గోపీనాథ్ హెచ్చరిక
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భీకరమైనదని, దీన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆయిల్ షాక్గా ఆమె అభివర్ణించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఎదురయ్యే సవాళ్లను విశ్లేషించారు.
వృద్ధి రేటుపై నీలినీడలు
సంక్షోభం కొనసాగే కాలాన్ని బట్టి ప్రపంచ వృద్ధి రేటు దెబ్బతింటుందని గోపీనాథ్ స్పష్టం చేశారు. ఆమె విశ్లేషణ ప్రకారం.. రాబోయే వారం రోజుల్లో సమస్య సర్దుమణిగితే ప్రపంచ వృద్ధిపై ప్రభావం తక్కువగా (సుమారు 0.3% శాతం పాయింట్లు) ఉంటుంది. ఒకవేళ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును చేరితే ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత అంచనా 3.4% నుంచి 2.5%కి పడిపోయే ప్రమాదం ఉంది.
భారత్పై ద్వంద్వ ప్రభావం
ఇరాన్ వివాదం భారత్కు ప్రతికూల అంశమే అయినప్పటికీ దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఊరటనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఒకవైపు ఇరాన్ వివాదం నెగిటివ్ ప్రభావం చూపుతుంటే మరోవైపు దిగుమతి సుంకాలు 50% నుంచి 10%కి తగ్గడం సానుకూల పరిణామం. ఈ రెండూ ఒకదానికొకటి భర్తీ చేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% వరకు ఉండవచ్చు’ అని ఆమె అంచనా వేశారు.
ఎరువులు, ఎల్పీజీ ముప్పు
కేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరా లేకపోవడం అనేది అసలైన సమస్య అని గోపీనాథ్ హెచ్చరించారు. ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోతే భారత్కు ఎరువులు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది. ఇది దేశీయ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పటికీ రవాణా మార్గాలు మూసుకుపోతే సాగుపై ఎరువుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతుంది.
సబ్సిడీలపై కీలక వ్యాఖ్యలు
పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం నిరవధికంగా భరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చమురు ధరలపై సబ్సిడీలు ఇస్తూ పోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. ఏదో ఒక దశలో పెరిగిన ధరలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదు’ అని ఆమె చెప్పారు. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ భారత దేశీయ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఆర్థిక వ్యవస్థలు కుదుటపడతాయని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం


