
కష్ట సమయాల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మనశ్శాంతి కోసం గుడికి వెళుతుంటారు. తమ కోరికలను దేవుడికి చెప్పుకొని మనసులోని భారాన్ని దించుకుంటారు. అదే ఆ దేవుడు నిజంగా మీ కోరికలు వింటే ఎంత బావుంటుంది.. అంతటితో ఆగకుండా సావధానంగా వాటికి పరిష్కారాలు అందిస్తే.. అసలు మీతోనే దేవుడు నేరుగా మాట్లాడితే.. ఇదంతా కలలోనే సాధ్యమని అనుకుంటున్నారా? ఇలలోనూ సాధ్యమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో మలేషియాలోని ఓ గుడిలో ఏఐ దేవత ‘మాజు’ను ఐమజిన్ అనే కంపెనీ తయారు చేసింది.
దక్షిణ మలేషియా రాష్ట్రం జొహోర్లోని తియాన్హౌ అనే టావోయిస్ట్(చైనీస్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న గుడి) దేవాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దేవత ‘మాజు’. ఇది అత్యంత గౌరవనీయమైన చైనీస్ సముద్ర దేవతను పోలి ఉన్న డిజిటల్ దేవత. ఇది భక్తులతో నేరుగా సంభాషిస్తుంది. వారి సమస్యలను సావధానంగా వింటోంది. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.
ఇదీ చదవండి: రంగులు మార్చే చాట్జీపీటీ
‘మాజు’ను అభివృద్ధి చేసిన మలేషియా టెక్ సంస్థ
ఏఐ క్లోనింగ్ సేవలను అందించే మలేషియా టెక్నాలజీ కంపెనీ ఐమజిన్ ఈ డిజిటల్ దేవతను రూపొందించింది. ఏప్రిల్ 20న సముద్ర దేవత 1,065వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఏఐ మాజును లాంచ్ చేశారు. మాండరిన్తోపాటు ఇతర కొన్ని భాషల్లో ఈ దేవత సంబాషించగలదని కంపెనీ తెలిపింది. ఒక ప్రదర్శన వీడియోలో కంపెనీ వ్యవస్థాపకుడు షిన్ కాంగ్ ఏఐ మాజును కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ‘మాండరిన్లో పెన్ కాయ్ ఉన్ అనే ఊహించని అదృష్టం నన్ను వరిస్తుందా?’ అని అడిగినప్పుడు, మాజు ‘మీరు ఇంట్లోనే ఉంటే ఊహించని సంపద రూపంలో మీరు అదృష్టవంతులు అవుతారు’ అని సావధానంగా సమాధానం ఇచ్చింది. నిద్రించడానికి ఇబ్బంది పడుతున్న ఒక యాత్రికుడికి ఏఐ మాజు దేవత సలహా ఇచ్చింది. ‘నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు త్రాగడంతో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని తెలిపింది.