ఈవీ చార్జర్లు తదితర ఉత్పత్తుల సంస్థ ఎగ్జికామ్ టెలీసిస్టమ్స్ హైదరాబాద్లో తమ కొత్త సమగ్ర తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీనిపై రూ. 216 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ సీఈవో అనంత్ నహతా తెలిపారు. 18.4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు తొలి దశతో ఉత్పత్తి సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, ప్రాంతీయంగా 750 పైగా ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.
దేశీయంగా ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్స్, క్రిటికల్ పవర్ సొల్యూషన్స్కి పెరుగుతున్న డిమాండ్ని తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని నహదా చెప్పారు. ఇందులో ట్రై–ఫ్లక్స్ లిక్విడ్ కూల్డ్ పవర్ మాడ్యూల్స్ని కూడా తయారు చేయనున్నట్లు, అలాగే దేశీయంగా తొలి ఈవీ చార్జర్ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్ సెంటర్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.


