
ధరల శ్రేణి రూ. 304–321
రూ. 2,981 కోట్లపై కన్ను
రూ. 1,340 కోట్ల యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ నేడు(28న) ప్రారంభంకానుంది. 30న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 304–321కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 321 ధరలో 4.17 కోట్ల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 1,340 కోట్లు అందుకుంది. మ్యూచువల్ ఫండ్స్సహా 36 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.
వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 2,981 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది.
రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో గతేడాది ఆగస్ట్లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మొత్తం రూ. 11,956 కోట్ల విలువలో ఏథర్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లవరకూ దరఖాస్తుకు వీలుంటుంది. షేర్ల కేటాయింపు మే 2న ఉండవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 6న లిస్టయ్యే వీలుంది.