క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
పాల్వంచ: క్రీడలపై ప్రతీ ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడామైదానంలో కేటీపీఎస్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం 7వ దశ సీఈ సూర్యనారాయణ ప్రారంభించారు. పోటీల్లో మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మం, చర్ల, రుద్రంపూర్, పాల్వంచ జట్లు పాల్గొని ఉత్సాహభరితంగా ఆడి తమ సత్తా చాటారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ క్రీడాకారులతో ఫుట్బాల్ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడలు ఎంతో అవసరమని, యువత సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, ఎస్ఈ యుగపతి, ఆరిఫ్, నిర్వాహకులు సుధాకర్రాజు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫుట్బాల్ టోర్నీ ప్రారభంలో కలెక్టర్


