రాళ్లవాగు వద్ద పులి ఆనవాళ్లు
కరకగూడెం: కరకగూడెం, పినపాక మండలాలకు ఆనుకుని ఉన్న ఏడూళ్లబయ్యారం అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం అటవీశాఖ సిబ్బంది పలు బృందాలుగా విడిపోయి అటవీ అంతటా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు రేంజ్ అధికారి తేజస్వి వెల్లడించారు. కరకగూడెం మండలంలోని రాయనపేట, కలవలనాగారం అటవీ ప్రాంతాల మధ్యనున్న రాళ్లవాగు వద్ద పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిపారు. అక్కడి నుంచి రేగళ్ల సమీప అటవీ అంతర్భాగంలోకి కదిలినట్లు ఆనవాళ్ల ఆధారంగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి కదలికలు గమనించిన వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పహారా బలగాలను పెంచి, పులి సంచారాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు.


