
డైనోసార్.. స్టెగోడాన్
బొగ్గు తవ్వకాల్లో..
గోదావరి లోయలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు
తెలంగాణ గడ్డపై నడయాడిన
భారీ జంతువులు
బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక పెవిలియన్లో ప్రదర్శన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సృష్టి పరిణామ క్రమంలో భూమిపై మంచుయుగం అంతరించాక రాక్షస బల్లులు (డైనోసార్లు), రాకాసి ఏనుగు(స్టెగోడాన్)ల వంటి భారీ జంతువులు వేర్వేరు కాలాల్లో ఆవిర్భవించాయి. ఈ జంతువులు క్రీస్తు పూర్వం మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై సంచరించాయి. ఆ కాలంలో జీవించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగులు, రాక్షస బల్లులు ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతంలో ఒకప్పుడు రాజ్యమేలాయి. అందుకు సంబంధించిన అవశేషాలు కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నాయి.
గత ఏప్రిల్లో స్టెగోడాన్ అవశేషాలు
గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, వార్థా, పెన్ గంగా పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో 2025 ఏప్రిల్లో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలు లభించాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అప్పటికే సింగరేణి ఆధీనంలో స్టెగోడాన్ ఏనుగుల అవశేషాలపై దృష్టి పడింది. తెలంగాణ గడ్డపై జీవించిన ప్రాచీన జీవజాలానికి సంబంధించిన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సింగరేణి–బిర్లా సైన్స్ సెంటర్లు జత కట్టాయి. అందులో భాగంగా బిర్లా సైన్స్ సెంటర్లో సింగరేణి పెవిలియన్ పేరుతో ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటుకు నిర్ణయించారు. సింగరేణి తవ్వకాల్లో లభించిన వందలాది పురాతన శిలాజాల్లో యాభైకి పైగా శిలాజాలను కొత్తగూడెం నుంచి హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రదర్శనకు పెట్టారు. అందులో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు దంతాలు కూడా ఉన్నాయి. అంతకుముందు మరొక జత స్టెగోడాన్ ఏనుగు దంతాలు, దవడ అవశేషాలను నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఇచ్చారు. ప్రస్తుతం కొత్తగూడెం మ్యూజియంలో స్టెగోడాన్ ఏనుగుకు సంబంధించిన ఒక దంతం, దాని రిప్లికాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలోనే డైనోసార్లు..
సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన గోదావరి పరీవాహక ప్రాంతం ఒకప్పుడు భారీ జంతువులకు నెలవుగా ఉండేది. ప్రస్తుతం బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని డైనోసారియంలో కనిపించే రాక్షస బల్లి(డైనోసార్) ఆకృతికి సంబంధించిన అవశేషాలు గోదావరి తీరంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేమనపల్లి దగ్గర అడవుల్లో 1974–80 వరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన పరిశోధనల్లో లభించాయి. మొత్తంగా 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో డైనోసార్ ఆకృతి తయారుచేశారు. అంతకు ముందు 1960, 70వ దశకాల్లో ప్రస్తుత ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో సైతం ప్రాచీనకాలానికి సంబంధించిన జంతుజాలం అవశేషాలు లభించాయి. వీటిని బిర్లా సైన్స్ సెంటర్, ఆర్కియాలజీ మ్యూజియం, వరంగల్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) మ్యూజియం–బండ్లగూడలో భద్రపరిచారు. చివరిసారిగా 2014లో ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం దగ్గర ప్రాచీన శిలాజాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్ వేదికగా పెవిలియన్ ఏర్పాట్లు చేశాం. బొగ్గు తవ్వకాల సందర్భంగా లభించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలను ఈ తరానికి చూపించాలనేది మా లక్ష్యం. అందుకే సింగరేణి పెవిలియన్ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
–బలరాంనాయక్, సింగరేణి సీఎండీ
గోదావరి–ప్రాణహిత నది పరీవాహకంలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా బొగ్గును వెలికితీస్తోంది. 2020–21లో పెద్దపల్లి జిల్లా రామగుండం–2 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఓవర్ బర్డెన్(మట్టి) తొలగిస్తుండగా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఐదు ఏనుగు కొమ్ములు లభించాయి. వీటిపై పరిశోధనలు జరిపి, కీస్తు పూర్వం 26 వేల నుంచి 23 వేల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలుగా తేల్చారు. ఈ ఏనుగు 13 అడుగుల ఎత్తుతో 13 టన్నుల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటన్నింటినీ కొత్తగూడెంలోని ఎక్స్ఫ్లోరేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఎపిక్ సెంటర్లోని మ్యూజియంలో భద్రపర్చారు.
సింగరేణి తవ్వకాల్లో లభించిన అవశేషాలు

డైనోసార్.. స్టెగోడాన్