
ఇల్లెందుకు దేవాదుల!
సీఎం రేవంత్ దృష్టికి
పాకాల – బయ్యారం పెద్ద చెరువుకు ప్రణాళిక అమల్లోకి వస్తే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో కొత్తగూడ, గంగారం మండలాలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీఎంకు సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు. దీంతో ఈ ప్లాన్ను పట్టాలెక్కించే విషయంలో వారిద్దరూ సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత మార్చిలో దేవాదుల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇటీవల సీఎం రేవంత్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్లాన్కు ఆమోదం లభిస్తే బయ్యారం వరకు వచ్చిన నీటిని రోళ్లపాడు మీదుగా పాలేరుకు తరలించే అంశంపై ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించాల్సి ఉంటుంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయితే సీతారామ కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో దేవాదుల ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాకు తెచ్చే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి.
ప్లాన్ మారింది.. నీళ్లు రాలేదు
సీతారామ ప్రాజెక్టు పనులు 2016లో ప్రారంభించినప్పుడు దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి నీటిని జిల్లాలో ఎత్తయిన ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడుకు తరలించాలని నిర్ణయించారు. పది టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి, ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఉమ్మడి జిల్లాలోని పంటపొలాలకు తరలించాలని భావించారు. అయితే దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి రోళ్లపాడు వరకు నీటిని తెచ్చే క్రమంలో కిన్నెరసాని అభయారణ్యం అడ్డుగా ఉందంటూ ఈ ప్లాన్ను మార్చారు. దీంతో గోదావరి నీటిని ములకలపల్లి మండలం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు వేర్వేరు లిఫ్టుల ద్వారా సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు కెనాల్గా రీ డిజైన్ చేశారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు జరుగుతుండగా పాలేరు పనులు మధ్యలో నిలిచిపోయాయి. జూలూరుపాడు వద్ద 10 కి.మీ. టన్నెల్ పూర్తయితేనే పాలేరుకు నీరు.. లేదంటే రాజీవ్ కెనాల్ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణతో సరిపెట్టుకోవాల్సిందే.
అనేక అడ్డంకులు..
సీతారామ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో 6.50 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, నిధుల కేటాయింపు చూస్తుంటే అశ్వారావుపేట, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలతో పాటు రాజీవ్ కెనాల్ ద్వారా వైరా దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందే పరిస్థితి మాత్రమే ఉంది. అటవీశాఖ అనుమతులు సాధించి, భారీగా నిధులు కేటాయిస్తేనే జూలూరుపాడు దగ్గర పది కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాతే పాలేరు, ఖమ్మం నియోజకర్గాలకు నీరు అందనుంది. ఇక ఇల్లెందు నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లా ప్యాకేజీ కోసం అదనంగా రూ.3,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పాకాల నుంచి బయ్యారం వరకు..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గోదావరి జలాలు అందించేందుకు 25 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీరు రామప్ప జలాశయం ద్వారా పాకాల వరకు వస్తోంది. అక్కడికి చేరుకున్న గోదావరి నీటిని బయ్యారం చెరువుకు తరలించే ప్రత్యామ్నాయ ప్లాన్ను ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాకాల చెరువు సముద్ర మట్టం నుంచి 250 అడుగుల ఎత్తులో ఉండగా బయ్యారం చెరువు 198 అడుగుల ఎత్తులో ఉంది. అయితే మధ్యలో కొన్ని గుట్టలు అడ్డుగా ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.1000 కోట్లు ఖర్చు చేసి కొన్ని ఎత్తిపోతలు, కొత్త కాల్వల నిర్మాణం ద్వారా పాకాల నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలు తేవచ్చనే నిర్ణయానికి వచ్చారు.
పాకాల జలాశయం వరకు వస్తున్న గోదావరి జలాలు
అక్కడి నుంచి బయ్యారం పెద్ద చెరువుకు తరలింపు
ముందుగా గార్ల, బయ్యారం మండలాలకు నీరు..
ఆపై బయ్యారం నుంచి రోళ్లపాడుకు వస్తే ఉమ్మడి జిల్లాకు లబ్ధి
సీఎం రేవంత్ చెంతకు ప్రతిపాదన

ఇల్లెందుకు దేవాదుల!