
త్వరలో సీఎం రాక?
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన
● యంగ్ ఇండియా పాఠశాలల ప్రారంభోత్సవం ● స్థానిక ఎన్నికలకు ముందు పార్టీలో జోష్ తెచ్చేలా పర్యటనకు ప్రణాళిక
ప్రారంభోత్సవాలు
పర్యాటక రంగం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీఎం జిల్లా టూర్ ఖరారైతే అందులో శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా నిర్మాణం సాగుతున్న హరిత కన్వెన్షన్ సెంటర్, హరితా హోటళ్లతో పాటు కిన్నెరసాని ఎకో టూరిజం కాటేజీలను ప్రారంభించేందుకు యత్నిస్తున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను మరింతగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గస్థాయిలో పార్టీ కేడర్ను ఉత్తేజపరిచే పనిలో ఉన్నారు. పైగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది. దీంతో ఇక్కడి నుంచే పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టే ఆలోచనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ముందు సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందా అంటే అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జిల్లాకు మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశంలో ఏకై క వర్సిటీ
దేశంలోనే మొట్టమొదటి ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీని జిల్లాకు మంజూరు చేశారు. ఈ కాలేజీలో అందించాల్సిన కోర్సులపైనా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మరోవైపు కేంద్రం నుంచి నవోదయ స్కూల్/కాలేజీ జిల్లాకు మంజూరైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనిర్సిటీ పనులను సీఎంతో లాంఛనంగా ప్రారంభింపజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీ భవన నిర్మాణాలు, ఎక్విప్మెంట్ కోసం రూ.200 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది.
స్థలసేకరణ అయితే
జిల్లాకు ఐదు యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరయ్యాయి. ఒక్కో స్కూల్కు రూ.200 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రతీ పాఠశాలను కనీసం 15 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొత్తగూడెం, పినపాకలలో స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించారు. ఇల్లెందు విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. అశ్వారావుపేట, భద్రాచలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. స్థల సేకరణ పూర్తయితే ఐదు యంగ్ ఇండియా స్కూళ్ల పనులకు ఒకేసారి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలను ఏకం చేస్తూ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. ఈ కార్పొరేషన్కు బడ్జెట్లో కేటాయించిన రూ.300 కోట్లతో చేపట్టబోయే పనులకు సీఎం చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించవచ్చనే అంశంపై కూడా హస్తం నేతలు దృష్టిపెట్టారు.