
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజు టెట్ ప్రశాంతం
సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో మూడో రోజు శుక్రవారం నిర్వహించిన టీజీ టెట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మంది అభ్యర్థులకు గాను మొదటి షిఫ్ట్లో 98 మంది, రెండో షిఫ్ట్లో 110 మంది హాజరయ్యారు. రెండు షిఫ్టుల్లో కలిపి 32 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆయిల్ఫెడ్ ఎండీ
ఆకస్మిక పర్యటన
అశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య శుక్రవారం ఆకస్మిక పర్యటించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఆయిల్పామ్ నర్సరీ, ఫ్యాక్టరీలను సందర్శించారు. గెలల దిగుమతి, క్రషింగ్, నూనె రికవరీ, ఉప ఉత్పత్తులు, నిర్వహణ తదితర వివరాలు తెలుసుకున్నారు. నారంవారిగూడెం నర్సరీలో మొక్కల పెంపకంపై ఆరా తీశారు. కాగా శంకరయ్య ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అశ్వారావుపేట డివిజన్కు రావడం ఇదే మొదటిసారి. ఆయన వెంట పీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, కిరణ్కుమార్, రాధాకృష్ణ, నాగబాబు, కళ్యాణ్ ఉన్నారు.
ముగిసిన కేంద్ర పథకాల నమోదు క్యాంపులు
భద్రాచలంటౌన్: గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తీ ఆభా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన పథకాల నమోదు కోసం నిర్వహించిన క్యాంపులు ముగిసినట్లు పీఓ రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 30 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 30 సదస్సులు నిర్వహించగా, 3,807 మంది గిరిజనులు పీఎం కిసాన్, ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, జనధన్, కులం సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కార్డుల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, 1,955 మందికి రిజిస్ట్రేషన్ చేశామని వివరించారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య