
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములకలపల్లి/చండ్రుగొండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, టీఎస్ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ములకలపల్లి మండలం రామాంజనేయపురం గ్రామంలో బత్తుల పుష్పలత, చెన్నకేశవులు దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం గుర్రాలకుంట, చింతలపాడు, అన్నారం గ్రామాల శివార్లలోని వాగులపై రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు హైలెవల్ వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. దామరచర్ల, సీతాయిగూడెం మధ్య ఉన్న ఎదుళ్లవాగుపై హైలెవల్ బిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీతాయిగూడెంలోని వెంగళరాయసాగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు నాలుగేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థికపరిస్థితి అథోగతికి చేరిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ పాలకులు ఖాళీ చేశారని ఆరోపించారు. ఇక్కడి వెంగళరాయసాగర్ అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 33.55 కోట్లు ప్రాజెక్ట్ అభివృద్ధికి మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రన్ శుక్రవారం ములకలపల్లి మీదుగా వెళ్తుండగా, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఒలింపిక్ జ్యోతితో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అధికారులు భూక్యా గనియా, రవికిరణ్, గద్దె రేవతి, అరుణ్బాబు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు తాండ్ర ప్రభాకర్రావు, కారం సుధీర్, భూక్యా పత్తీలాల్, సున్నం సుధాకర్, గాడి తిరుపతి రెడ్డి, శనగపాటి రవి, కె.రవి పాల్గొన్నారు.
నాలుగేళ్లలో రాష్ట్రంలో
20 లక్షల గృహాలు నిర్మిస్తాం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి