సూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7700.87 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. గతేడాదికి సంబంధించి రైతులు, స్వయం సహాయక సంఘాలతో పాటు వివిధ సంక్షేమ శాఖల రుణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పథకాల లక్ష్య సాధనకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,242.49 కోట్లకు గాను రూ. 3,960.63 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రుణాల మంజూరుతో పాటు రికవరీపై శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ అవసరాలకు రూ. 3,838 కోట్లు, ఎంఎస్ఎంఈ కింద రూ. 847.80 కోట్లు, ఇతర రంగాలకు రూ. 4,883.99 కోట్లు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, పశుసంవర్థక శాఖ డీడీ వెంకటేశ్వర్లు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
29, 30వ తేదీల్లో కేన్సర్ చికిత్స శిబిరాలు..
ఈనెల 29న భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల, 30న దుమ్ముగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్ ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరపత్రాలు, బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్.ఎల్. కాంతారావు, ఆయా సంఘాల బాధ్యులు సూర్యనారాయణ, జగదీష్, బి.రాజారెడ్డి, బి. సుబ్బరాజు, ఎం. మోహన్రావు, సుదర్శనరావు, పి.రాజశేఖర్, భానుప్రసాద్, వి.కామేశ్వరరావు, గట్టు వెంకటాచార్య, కమలా రాజశేఖర్, పాకాల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
సికిలెసెల్పై అప్రమత్తత అవసరం
భద్రాచలం: ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సికిల్సెల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. ప్రపంచ సికిల్సెల్ అనీమియా డే సందర్భంగా ఐటీడీఏలో గురువారం రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సికిల్సెల్ అనీమియా ప్రాణాంతక వ్యాధి కాదని, జన్యుపరంగా వస్తుందని తెలిపారు. ప్రాధమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. గిరిజనులు మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా అవగాహన జాతాలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 2047 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించేలా చూడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 130 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఏడీఎంహెచ్ఓ చైతన్య, సికిల్సెల్ ప్రోగ్రాం అధికారి మధుకర్, ఆర్ఎంఓ రాజశేఖర్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి అవగాహన అవసరం
చుంచుపల్లి: పంచాయతీల అభివృద్ధికి అవగాహన అవసరమని కలెక్టర్ అన్నారు. గురువారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, డిజిటల్ లావాదేవీలు, మహిళా భాగస్వామ్యం వంటి విభిన్న అంశాల్లో పంచాయతీల స్థితిగతులు అర్థమవుతాయని అన్నారు. వీటి పురోగతిపై అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి