
చెక్ డ్యాంలో పడి వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం వైకుంఠధామం సమీపంలోని చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెంగల చిన్న వెంకయ్య(55) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదు. బుధవారం చెక్ డ్యాం నీటిలో మృతదేహం లభ్యమైంది. అనారోగ్యం, మానస్థితి బాగాలేక బాధపడుతున్న చిన్న వెంకయ్య బహిర్భూమికి వెళ్లి చెక్ డ్యాంలో పడి మృతి చెంది ఉండవచ్చునని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
చికిత్స పొందుతున్న యువకుడు..
టేకులపల్లి: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని తావుర్యాతండా పంచాయతీ స్టేషన్తడికలపూడి గ్రామానికి చెందిన గుగులోత్ తరుణ్(20) పదేళ్లుగా అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పాల్వంచలో..
పాల్వంచరూరల్: పురుగుల మందుతాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతానికి చెందిన రామనాథ్ నరేష్(37) మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న అత్తవారింటికి వచ్చాడు. కాగా నరేష్కు, అతని భార్య త్రివేణి, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య మంగళవారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
షీ టీం అదుపులో యువకుడు
సూపర్బజార్(కొత్తగూడెం): రామవరంలోని మాతా శిశు ఆస్పత్రి వద్ద ఉన్న బస్స్టాప్ వద్ద ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న యువకుడిని బుధవారం షీ టీం ఎస్ఐ రమాదేవి అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజులుగా ఓ యువతిని వేధిస్తుండటంతో ఆమె షీ టీంను ఆశ్రయించింది. దీంతో ఎస్ఐ రమాదేవి మఫ్టీలో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలను ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులు భయపకుండా తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.