
గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో విచారణ
భద్రాచలంటౌన్: పట్టణంలోని గిరిజన జూనియర్ కళాశాల, స్కూల్ విద్యార్థుల హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై నిజనిర్ధారణ కమిటీ బుధవారం విచారణ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 20న వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేవని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఫిర్యాదుపై భద్రాచలంలో కోర్టులో కేసు నమోదైంది. దీంతో భద్రాచలం ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివ నాయక్ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు న్యాయవాది చుక్క నాగఅంబేడ్కర్, పేరాల నాగరాజు, ఎంవీ రమణలు హాస్టళ్లను సందర్శించి, స్థితిగతులను పరి శీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్కూలు విద్యార్థులకు హాస్టల్లో సరైన బెడ్లు లేవని, తగిన సంఖ్యలో మరుగుదొడ్లు కూడా లేవని, దుర్వాసన వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. సరిపడినంత భోజనం కూడా పెట్టడం లేదని, మెస్ బిల్లులు కూడా సక్రమంగా అందట్లేదని విద్యార్థులు కమిటీ సభ్యులకు తెలిపారు. ప్రిన్సిపాల్, వార్డెన్ను విచారించగా దాదాపు 8 నెలల నుంచి మెస్ బిల్లు రావట్లేదని, దీంతో కావలసినన్ని సరుకులు అందటంలేదని వివరించారు. హాస్టళ్ల స్థితిగతులపై న్యాయమూర్తికి నివేదిక ఇస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు.
భద్రాచలం న్యాయమూర్తికి నివేదిక
ఇవ్వనున్న నిజనిర్ధారణ కమిటీ