
కార్పొరేషన్గా కొత్తగూడెం
● గెజిట్ విడుదల, త్వరలో జీఓ ● రెండు మున్సిపాలిటీలు, ఏడు పంచాయతీలతో ఏర్పాటు
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే జీఓ కూడా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు అంటున్నారు. జీఓ విడుదల అయ్యాక డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ జరుగనుంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా లక్షకు పైగా జనాభా, 65 వేల మంది ఓటర్లు ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో 24 వార్డులు, లక్ష జనాభా, 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో కలిపి 14 వేల మంది జనాభా, 10 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేయాలని గెజిట్లో పేర్కొన్నారు. కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయితే భూములు, ఆస్తుల విలువతో పాటు ఇళ్లు, పంపుల పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాగా, పాల్వంచ మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు కేసులు ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరుగలేదు. ఇక కార్పొరేషన్ ఆమోదంతో ఎన్నికలు జరుగుతాయని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు..!
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో పని చేసే ఉద్యోగులకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు చెల్లించే పన్నులు పెరిగినట్టుగానే ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. జీఓ విడుదల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్గా పేరు మార్చడం, డివిజన్ల ఏర్పాటుతో పాటు కమిషనర్ను నియమించాల్సి ఉంది.