
బైక్ల చోరీ.. నంబర్ మార్చి విక్రయం
పెనుబల్లి: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేయడమే కాక నంబర్ ప్లేట్లు మార్చి ఇతరులకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు 18 బైక్లను చోరీ చేసిన వీరు వీఎం బంజర్ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ కె.రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ఎంఎల్.ముత్తిలింగయ్యగౌడ్, వీఎం బంజర్ ఎస్ఐ కె.వెంకటేశ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అర్బన్ కాలనీకి చెందిన మక్కెళ్ల నాగరాజు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చల్లా శివప్రసాద్ వీఎం బంజర్, సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా పెద్దవేగి స్టేషన్ పరిధిలో రూ.12.45 లక్షల విలువైన 18 ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటిలో కొన్నింటి నంబర్ మార్చి పెనుబల్లి మండలం గంగదేవిపాడు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం వాసులకు అమ్మగా, వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. మిగతా వాహనాలను ఎన్ఎస్పీ కాలువ పక్కన పొదల్లో దాచి అందులో రెండింటిని అమ్మేందుకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఖమ్మం వైపు నుంచి వీఎంబంజర్ వైపు వెళ్లే మార్గంలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఎలాంటి పత్రాలు లేకపోగా, తడబడుతుండడంతో వాహనాల చాయిస్ నంబర్ ఆధారంగా ప్రశ్నించడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో నాగరాజు, శివప్రసాద్ను అరెస్ట్ చేయడమే కాక వీరి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన ఓర్సు వెంకటనారాయణ, పందేళ్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్రావు, బత్తుల కొండల్రావు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన డేరంగుల నాగసాయి, ఉప్పతాల సతీశ్, ఉప్పతాల గోపి, ఉప్పతాల రాజుపైనా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు శ్రీగాద రాజమల్లు, పి.వెంకటేశ్వర్లు, మోహిద్పాషా, బాలకృష్ణ, సురేశ్ను ఏసీపీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.
రెండు రాష్ట్రాల్లో చోరీలకు
పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్