పర్చూరు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపాలి వైఎస్సార్ సీపీ ప్రకాశం, బాపట్ల జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల 16వ రోజు కొనసాగిన పర్చూరు ప్రాంత రైతుల నిరాహార దీక్ష
పర్చూరు (చినగంజాం): గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి పర్చూరు ప్రాంత గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ ప్రకాశం, బాపట్ల జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకుడు, ప్రకాశం జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. గుంటూరు చానల్ పొడిగించాలని కోరుతూ పర్చూరులో 15 రోజుల నుంచి రిలే నిరాహార నిరసన దీక్ష చేస్తున్న రైతుల శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దగ్గుబాడు చానల్ను అన్యాయంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధి వరకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని ముక్కలు చేయడం అన్యాయమన్నారు. దాని మొదట నామకరణమే దగ్గుబాడు చానల్ అని, పత్తిపాడు, పర్చూరు, దగ్గుబాడు వరకు ఏర్పాటు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని, ఆ ఆలోచన ఇప్పటిది కాదని 50 సంవత్సరాల క్రితమే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజానాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని పర్చూరు ప్రాంత భూములు మెట్ట భూములుగా పరిగణించి దాన్ని దగ్గుబాడు వరకు పొడిగించాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. దగ్గుబాడు చానల్గానే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. దాన్ని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నందిపాడు వరకు 45 కిమీ ఆయన పార్లమెంట్ వరకే పరిమితం చేయడం ద్వారా పర్చూరు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పర్చూరు ప్రాంతాన్ని ముంపు బారి నుంచి తప్పించేందుకు నల్లమడ అభివృద్ధికి కొల్లా వెంకయ్య కృషి చేశారని, వారితో కలిసి భాగస్వామ్యులుగా నల్లమడ వాగు అభివృద్ధికి కృషి చేశామన్నారు. తాను పర్చూరు ఇన్చార్జ్గా ఉండి సాకి వాగు, నక్కల వాగు, డక్కుల వాగు, ఆలేరు వాగు, కొణికి వాగుల నుంచి వెల్లువ ఏర్పడి మునిగి పోతుండటంతో రూ.3 కోట్ల ఖర్చుతో కాపాడినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో చానల్ను సర్వే చేయించి ఇంకొల్లు వరకు పొడిగించాలని అంచనాలను కూడా తయారు చేయించామని, అయితే బడ్జెట్ అదనంగా పెరుగుతుండటంతో అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికై నా పర్చూరు ప్రాంత శాశ్వత పరిష్కార దిశగా దగ్గుబాడు చానల్ను పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నట్లు బత్తుల తెలిపారు.
రైతుల దీక్షకు సంఘీభావం
గంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ జేడీశీలం సోమవారం సందర్శించి దీక్ష చేస్తున్న రైతలకు సంఘీభావాన్ని తెలిపారు. పర్చూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నల్లగొర్ల నాగజ్యోతి దీక్ష చేస్తున్న రైతులకు తన సంఘీభావాన్ని తెలియజేస్తూ పర్చూరు ప్రాంత ప్రజలు, రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలో పాల్గొన్న వారిలో డాక్టర్ కొల్లా రాజమోహనరావు, సింహదాటి సీతారామయ్య, తులసి శివనాగేశ్వరరావు, ఎం. గౌస్బాషా, జిలానీబాషా, ఎన్.శ్రీనివాసు, టి.జయరావు, దొప్పలపూడి నాగయ్య, చెన్నుపాటి సూర్యప్రకాశరావు, గోరంట్ల రంగారావు, ఎల్.వీరాంజనేయులు, రాంబాబు, తులసి సాంబశివరావు, తులసి శ్రీనివాసరావు, కృష్ణ, డి.మల్లికార్జునరావు, ఏ.సుందరరావు, గోరంట్ల భాస్కరరావు, తులసి శివనాగేశ్వరరావు, మత్తే డేవిడ్, తులసి శంకర్, సీహెచ్ శ్రీను, వనమా పేతురు, సయ్యద్ బాజీ, జి.రవిబాబు, ఎం.నూర్ద్దీన్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ పి.బ్రహ్మయ్యకు రైతులు వినతి పత్రం అందజేశారు.


