బాపట్ల: ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న బొప్పరాజుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ సి.హెచ్. సురేష్ బాబు అన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ నోటీసును వందలాది మంది ఉద్యోగులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు అందజేశారు. ఉద్యోగులను ఉద్దేశించి సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్యోగ సంఘాల నాయకులపై విమర్శలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. బొప్పరాజు రాజకీయ అజెండాతో ఉద్యమం చేస్తున్నారనే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగుల సమస్యలు వినిపించడం ఆయన బాధ్యతగా నిర్వహిస్తున్నారన్నారు. బొప్పరాజుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకూడదన్నారు. ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉద్యోగ సంఘాల తరఫున బొప్పరాజు ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అనేక న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో తొలి దశ ఉద్యమ కార్యాచరణను మాత్రమే ప్రకటించి, స్పందన కోసం వేచి చూస్తున్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకుండా, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ పి. రజిని, కార్యదర్శి షేక్ హాజరాబేగం, జేఏసీ కో చైర్మన్లు బి. ఓంకార్, కె. మురళి మోహన్ రెడ్డి, డి. శ్రీకాంత్, హెచ్ఎంల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల బ్రహ్మారెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. రమేష్, ఆర్టీసీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. పెంచలయ్య, పి. కమలాకర్, రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి యు. శకుంతల తదితరులు పాల్గొన్నారు.


