జాయింట్ కలెక్టర్ సంజనా సింహ కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


