స్పందించిన రెవెన్యూ అధికారులు..హెచ్చరిక ప్లెక్సీ ఏర్పాటు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచన చేసిన అధికారులు
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


