బాపట్లటౌన్: మొబైల్ ఫోన్ల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ తెలిపారు. మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న 201 మంది బాధితులకు మంగళవారం ఫోన్లను అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది గడిచిన మూడు నెలల వ్యవధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు రూ. 1.61 కోట్ల విలువైన 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి నెలా ‘మొబైల్ రికవరీ మేళా‘ నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన బిల్లులు లేని, అతి తక్కువ ధరకు విక్రయించే అనుమానాస్పద ఫోన్లను కొనవద్దన్నారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఏ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ సీఐ వి.సూర్యనారణ, ఎస్బీ సీఐ బి.నారాయణ, ఆర్ఐ షేక్ మౌలుద్దిన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న తీవ్రమైన సాధారణ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో దొంగిలించబడిన సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు, ముఖ్య ప్రదేశాల్లో వేకువజామున 2 గంటల నుంచి నిర్వహించాలన్నారు. దేవాలయాల వద్ద భద్రతను పటిష్టం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఎ. శ్రీనివాసరావు జిల్లాలోని సీఐలు,ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


