అటు ఉద్యోగం లేదు ..
ఇటు నిరుద్యోగ భృతి లేదు
వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారంలో బాబు హామీ జీతం నెలకు రూ.10 వేలకు పెంచి ఉగాదికి అమలు చేస్తామని నాడు భరోసా తీరా పాలనలోకి వచ్చాక ఆ ఊసే లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్న నాటి వలంటీర్లు
చీరాల అర్బన్: చంద్రబాబు ఏ హామీ అయినా ఇవ్వగలడు. నమ్మించగలడు.. వంచించగలడు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన హామీలు... తరువాత వాటిని పట్టించుకోకపోవటం అందుకు నిదర్శనమనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామన్నారు. ఉగాది కానుకగా అమలు చేస్తామని వలంటీర్లను నమ్మబలికారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోయారు. రేపు ఉగాది. బాబు ఏది మా జాబు .. అని వలంటీర్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీరు ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థకు పురుడు పోశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే నేరుగా అందాయి. క్షేత్ర స్థాయిలో పరిపాలనకు దిక్సూచిలుగా మారారు. పారదర్శక సేవలు అందించారు. ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది.
ఆశ పడ్డారు.. భంగ పడ్డారు
– ఎన్నికల వేళ చంద్రబాబు చెప్పిన మాటలకు ఎక్కువ మంది వలంటీర్లు ప్రభావితం అయ్యారు. వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూ, నెలకు జీతం రూ.10వేలు చేస్తామనే మాటకు ఆశపడ్డారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆ ఊసే ఎత్తక పోవటంతో భంగపడ్డారు. ప్రస్తుతం బాధపడుతున్నారు.
వలంటీర్లలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. పని లేకుండా ఇంట్లో పెద్దలకు భారం కాకుండా ఉండేందుకు కొలువు చిన్నదైనా గౌరవంగా ఉంటుందని, పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని వలంటీర్లుగా చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పుకున్నారు. అయితే తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఉన్న ఉద్యోగం పోయి, మరలా నిరుద్యోగులుగా మిగిలారు.
వలంటీర్ వ్యవస్థ లేకుంటే చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన మరో హామీ నిరుద్యోగ భృతి అన్నా దక్కక పోతుందా అని భావించారు. అయితే నిరుద్యోగ భృతి అమలు ఎప్పటికో తెలీదు. అసలు అమలు చేస్తారో లేదో తెలీదు. ఇది ఒక రకంగా తమ జీవితాలతో చెలగాటమాడుకున్నట్లేనని వారు వాపోతున్నారు. అయితే తమ బాధను బహిరంగంగా కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


