
ఆసోది భాగ్యలక్ష్మికి ఉత్తమ నాయకత్వ పురస్కారం
చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాం జెడ్పీటీసీ సభ్యురాలు ఆసోది భాగ్యలక్ష్మికి ఉత్తమ నాయకత్వ పురస్కారం అందజేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు.
జంట హత్యల కేసులో
27 మంది బైండోవర్
బల్లికురవ: జంట హత్యలకు సంబంధించి మండలంలోని వేమవరం గ్రామంలో ఇరువర్గాలకు సంబంధించి 27 మందిని ముందు జాగ్రత్తగా బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. శాంతిభద్రతల దృష్ట్యా మండలంలో 20 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై నిఘా ఉంటుందని తెలిపారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా శాఖాపరంగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతుంటే పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో అల్లర్లు, అలజడులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.
చెరువులో జారిపడ్డ బాలుడు
అద్దంకిరూరల్: ప్రమాదవశాత్తూ చెరువులోకి బాలుడు జారిపడ్డ సంఘటన శుక్రవారం మండలంలోని వెంపరాల గ్రామంలో చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.... మండలంలోని వెంపరాల గ్రామంలోని 10 సంవత్సరాల బాలుడు భరత్ గ్రామంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడ్డాడు. సమీపంలోని పశువుల కాపరులు చెరువులో మునిగిపోతున్న బాలుడిని బయటకు తీశారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్కు తరలించారు. బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు 108 బల్లికురవ ఈయంటి రామాంజనేయులు తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: స్థానిక పసుపు యార్డుకు శుక్రవారం 698 బస్తాలు వచ్చాయి. మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 520 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. కాయలు 178 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. మొత్తం 523.500 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు యార్డు కార్యదర్శి తెలిపారు.

ఆసోది భాగ్యలక్ష్మికి ఉత్తమ నాయకత్వ పురస్కారం