మదనపల్లె టౌన్ : ప్రజలు రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. ప్రజలకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహన దారులు ప్రమాదాల బారిన పడకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ఆధ్వర్యంలో యువతలో చైతన్యం కోసం పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. నోడల్ ఆఫీసర్ ఆర్.వి.క్రిష్ణ కిషోర్, సర్వోదయ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి, ట్రాఫిక్ సీఐ గురునాథ్, పోలీసు, మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
పీలేరురూరల్ : ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన పీలేరు పట్టణం సదుం మార్గం పెద్దిరెడ్డిగారిపల్లె వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు – సదుం మార్గంలో బుధవారం రాత్రి ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఇన్నోవా కారు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం విరిగి కారుపై పడింది. అయితే కారులోని ప్రయాణీకులు పెనుప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.


