రాయచోటి : రాయచోటి– సుండుపల్లి మార్గంలోని అనుంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రవమాదంలో లోకేశ్వర నాయుడు (32) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సుండుపల్లి మండలం, మడితాటి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలు చూసుకొని బుధవారం వేకువజామున 1.30 గంటలకు స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు కలరు. రాయచోటి రూరల్ మండలం, మాధవరం పంచాయతీ, ఇర్రివాండ్లపల్లి, మద్దేవాండ్లపల్లి, జురుకుబాండ్లపల్లి, కురవపల్లికి చెందిన తొమ్మిది మంది మంగళవారం రాత్రి ఆటో ద్వారా సుండుపల్లి మండల పరిధిలో జరిగిన బంధువులు వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో అనుంపల్లి దాటిన తరువాత ఆటోను బహిర్భూమికి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో సుండుపల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా పి మనోహర్, ఆవుల శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనపై రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
మరో ఇద్దరికి గాయాలు


