మళ్లీ అధికారంలోకి వస్తాం
● రూ.కోట్ల అభివృద్ధిని చేతుల్లో పెడితే
రద్దు చేస్తారా
● చంద్రబాబు సర్కార్ తీరుపై
ఎంపీ మిథున్రెడ్డి ఆగ్రహం
సాక్షి, మదనపల్లె: జగనన్న పాలనలో మదనపల్లె అభివృద్ధికి రూ.వందల కోట్ల నిధులు మంజూరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధ్దికి చేపట్టిన పనులను నిలిపివేస్తే.. దీన్ని ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించరా అని రాజంపేట ఎంపీ, లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిలదీశారు. అడ్డుకున్న పనుల గురించి ప్రశ్నిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.వందల కోట్లతో మెడికల్ కళాశాల పనులు చేస్తే ఈ ప్రభుత్వం నిలిపేసిందని ధ్వజమెత్తారు. బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేస్తూ ఇచ్చిన జీవోను అడ్డుకున్నారు, మదనపల్లెకు మంజూరైన రహదారి నిర్మాణ పనులను ఆపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు..ఇలా అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటుంటే టీడీపీ నేతలు ఎందుకు మా ట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అభివృద్ధికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. జిల్లా కేంద్రం ఇచ్చారు కానీ పైసా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిలిపి వేసిన రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లెకు బైపాస్ రోడ్డు కోసం కేంద్రమంత్రికి విన్నవించగా ప్రస్తుత ఆర్థిక ప్రణాళికలో బైపాస్ రోడ్డును నివేదించారని, త్వరలోనే రహదారి మంజూరు అవుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినా జిల్లా కేంద్రం మదనపల్లె మారదన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వమే జిల్లా కేంద్రానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు చేశారు.
మదనపల్లె టౌన్ బ్యాంక్ అక్రమాలపై విచారణ
ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకు వ్యవహారాల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీకి చెందిన సానుభూతిపరులే ఈ విషయాలను వెలుగులోకి తెస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, ఎస్ఈసీ షమీం అస్లాం, మాజీ మున్సిపల్ చైర్మన్ వి.మనూజ, మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జన్నే శేషాచలపతి, పరిశీలకులు బాబ్జాన్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
కూటమిపాలన చూశాక ప్రజలు జగనన్న పాలనను గుర్తుకు చేసుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో గత ప్రభుత్వంలో జగనన్న పాలనే ప్రామాణికంగా వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట ఇక్కడ జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మదనపల్లె మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఒక్క టెండర్ దాఖలు కాలే దని గుర్తు చేశారు. తక్షణమే మదనపల్లె కళాశాల సంపూర్తి పనులు పూర్తిచేసి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మామి డి రైతులకు అనుకూలంగా ఊరట కలిగించే ఒక ప్రకటన చేయలేదన్నారు.తంబళ్లపల్లెలో మల్లయ్య కొండ మైనింగ్ ప్రతిపాదనల విషయంలో ప్రజలకు మద్దతుగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగనివ్వమని స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగిన కుంభకోణంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


