– బావిలో పడి మహిళ మృతి
చౌడేపల్లె : అసలే భగభగ మండే ఎండ.. కష్టపడి పొలం వద్ద పని చేస్తుండగా మధ్యాహ్న సమయంలో దప్పిక తీర్చుకోవడానికి బావి వద్దకు వెళ్లిన మహిళను మృత్యువు కబళించిన సంఘటన వెంగళపల్లెలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగళపల్లెకు చెందిన సుధాకర్కు బైరెడ్డిపల్లె మండలం బాపలనత్తంకు చెందిన సోముశేఖర్, ప్రభావతిల కుమార్తె గౌతమి(27) అలియాస్ సుజాతకు సుమారు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ పెద్దకొండామర్రి చెరువు కింద గల పొలం వద్దకు వెళ్లారు. పంట సాగు కోసం తోలిన సేంద్రియ ఎరువును పొలంలో చెల్లాచెదురు చేస్తుండగా.. గౌతమికి దాహం వేయడంతో నీరు తాగడానికి బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బావి వద్దకు వెళ్లిన భర్త కేకలు వేయగా.. చుట్టుపక్కల వారి సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. తనతోపాటు కష్టపడి పని చేస్తూ క్షణాల వ్యవధిలో భార్య మృతి చెందడంతో భర్త కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో వెంగళపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.


