● టీటీడీ చైర్మన్ను తొలగించాలి
● మదనపల్లెలో వైఎస్సార్సీపీ నిరసన
మదనపల్లె : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక చర్యలను నిరసిస్తూ శాంతియుత నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేసిన దోషులైన టీడీపీ నేతలను వదిలిపెట్టి బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగ ధర్మమని వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక గోళ్లపల్లె రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేసి, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూటమి పాలనకు, టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ నాయుడు మొదటి నుంచి వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతిసేలా వ్యవహరిస్తున్న ఆయన చైర్మన్ పదవికి అనర్హుడని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పౌరుల హక్కులను కాలరాసేలా కూటమి పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు, వేధింపులతో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పేర్కొన్నారు.
నిరసన తెలపడం తప్పా?
మున్సిపల్ చైర్మన్ మనూజ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. పాలకవర్గ చర్యలను ప్రశ్నించడం, ఖండించడం తప్పా అని నిలదీశారు. నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాసులు, ప్రసాద్బాబు, ఈశ్వర్నాయక్, కోఆప్షన్ సభ్యులు శారదరెడ్డి, పార్టీ నేతలు హర్షవర్దన్రెడ్డి, వీఎస్ రెడ్డి, రఘనాథరెడ్డి, మల్లికార్జున, శీలం రమేష్, రేవతి, సుధాకర్, షాజహాన్ఽ బేగం, గౌసియా, నాగమణి, లలితమ్మ, నరసింహులు, మంజుల, శంకర్నాయక్, మహేష్, శ్రీకాంత్, చలపతి, చరణ్, చెన్నకృష్ణ, పవన్తేజ, నూర్, జబీవుల్లా, వెంకటేష్యాదవ్, రమణ పాల్గొన్నారు.


